ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికి అదే జోరులో సాగుతుంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. ఈ వ్యాధితో కొన్ని వేల మంది బాధపడుతున్నారు. రోజు రోజుకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్యా కూడా పెరుగుతూనే ఉంది. దేశంలో లాక్ డౌన్ విధించడం వలన నష్టాలు ఎంతలా ఉన్నాయో ప్రయోజనాలు అంతే ఉన్నాయి. చాల మంది వారికీ రాని పనులను నేర్చుకుంటూ... వచ్చిన వాటిని అందిరికి తెలియజేస్తూ లాక్ డౌన్ సమయాన్ని గడిపేస్తున్నారు.
అయితే తాజాగా సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ వదులుకోలేదు అతను. లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు స్వగ్రామంలో ఉండే అవకాశం దొరకడంతో తన కోరికను తీర్చుకునే పనిలో పడ్డాడు అతను. ముఖ్యంగా పాడి పరిశ్రమపై దృష్టిసారించి ఆశయం నెరవేర్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. రామకుప్పం మండలం బందార్లపల్లెకు చెందిన గోవిందప్పకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్దవాడైన బీజీ నగేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలకు రూ.2లక్షల వేతనంతో పని చేస్తున్నాడు. ఆయన భార్య, తమ్ముడు రమేష్, మరదలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే తండ్రి గోవిందప్ప మాత్రం స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవన సాగిస్తున్నాడు. ఈక్రమంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో బందార్లపల్లెకు చేరుకున్నారు వీరందరూ.
అయితే దాదాపు మూడు నెలలుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. దీంతో నగేష్ తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ. ఈ క్రమంలో ఓ షెడ్డు నిర్మించుకున్నాడు. 20 పాడి ఆవులను కొనుగోలు చేశాడు. రెండెకరాలలో పశుగ్రాసం సాగు చేపట్టాడు. తానే దగ్గరుండి పాడి ఆవుల సంరక్షణ చూసుకుంటూ తండ్రికి చేదోడువాదోడుగా నిలిచాడు. వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా ప్రవృత్తి పరంగా తనలోని రైతును సంతృప్తి పరిచాడు. స్వగ్రామంలో వ్యవసాయం చేయడం తనను ఎంతో ఆనందపరిచిందని తెలిపారు..