ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, సీఎస్ నీలం సాహ్ని, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు హాజరైన సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్–2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, టన్నెల్–1 పనులు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టులో ఫేజ్ –2లో స్టేజ్–2 పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అవుకు టన్నెల్ –2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్న అధికారులు.. అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేస్తామని చెప్పారు. అలాగే వెలిగొండ టన్నెల్–1లో ఇంకా తవ్వాల్సింది 700 మీటర్లు ఉందని.. దీనిని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు.
జగన్ అనేక బ్యారేజ్లపై వేసుకున్న ప్లానింగ్లు చూస్తుంటే కేసీఆర్ తెలంగాణలో ఒక్క కాళేశ్వరమే కట్టాడు... ఇప్పుడు జగన్ చెప్పివని అన్నీ పూర్తయితే కాళేశ్వరాన్ని మించిన ఆయకట్టు ఏపీలో సాగు అవ్వడం పక్కా. ఇక నల్లమలసాగర్ పూర్తయ్యిందని, ఆర్ అండ్ ఆర్కూ అన్ని రకాల అనుమతులు వచ్చాయని, నల్లమలసాగర్ నుంచి ఈస్ట్రన్ మెయిన్ కెనాల్కు వెళ్లే 180 మీటర్ల టన్నెల్ పనులు కూడా మరో 3 నెలల్లో పూర్తవుతాయని.. తీగలేరు కెనాల్కు వెళ్లే 600 మీటర్ల టన్నెల్ పనులు కూడా పూర్తవుతున్నాయని.. వచ్చే నాలుగు నెలల్లో టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇక బ్యారేజ్ల వారీగా పనుల ప్లానింగ్ ఇలా ఉంది.
నెల్లూరు బ్యారేజీ:
నెల్లూరు బ్యారేజ్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, అందువల్ల రెండు నెలల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేస్తామని... అక్టోబరు చివరి నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడించారు. సంగం బ్యారేజీ పనులు కూడా అక్టోబరు చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు.
వంశధార నాగావళి లింక్:
వంశధార– నాగావళి లింక్ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.. వంశధార ఫేజ్ –2లో స్టేజ్ –2లో మిగిలిపోయిన పనులు కూడా వేగంగా సేఫ్ స్టేజ్ వరకు పూర్తి చేసి 8 టీఎంసీల నీరు నింపుతామని చెప్పారు. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన పనులు కూడా పూర్తవుతాయని... నేరడి బ్యారేజీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులతో సీఎం చర్చించారు.