సురక్షితమైన రక్తం అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించిన యాప్ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉన్న నిల్వలను ఒకే చోట తెలుసుకునే విధంగా యాప్ను రూపొందించారు. అవసరమున్న వ్యక్తులు నాలుగు యూనిట్ల రక్తాన్ని యాప్ ద్వారా అభ్యర్థించి.. బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలందరికీ సురక్షితమైన రక్తం సులభంగా అందుబాటులో ఉండే విధంగా మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించారు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్కు చెందిన ఈ-రక్త్ కోశ్ బృందం రూపొందించిన ఈ అప్లికేషన్ను ప్రారంభించారు.ఈ యాప్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన సేవలను సింగిల్ విండో ద్వారా యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. 

 

ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల్లో ఉన్న రక్త నిల్వల గురించి తెలుసుకోవచ్చని వైద్య శాఖ తెలిపింది. యాప్ ద్వారా ఒక అభ్యర్థన చేయగానే బ్లడ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాల్లోని ఈ-రక్త్కోశ్ డాష్బోర్డుపై సమాచారం కనిపిస్తుందని... దీని ద్వారా నిర్దిష్ట సమయంలో రక్తం సరఫరా చేసే అవకాశం ఉందని వైద్య శాఖ పేర్కొంది. కొవిడ్ సమయంలో దాతల నుంచి సేకరించి సురక్షితమైన రక్తం సరఫరా చేయడంలో రెడ్క్రాస్ సొసైటీ ముఖ్యమైన పాత్ర పోషించిందని హర్షవర్ధన్ కొనియాడారు. రెడ్క్రాస్ మేనేజింగ్ బాడీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 89 రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులు 1,100 అనుబంధ శాఖలు కలిసి లాక్డౌన్ సమయంలో లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ సమయంలో ఇన్-హౌజ్ డొనేషన్లతో పాటు రెండు వేల రక్తదాన కేంద్రాలను రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ రక్తదానం చేయాలని మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. 

 

తరచుగా రక్తదానం చేయడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు నయమవుతాయని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా రక్త దానం చేయాలనుకునే వారికి బ్లడ్ డొనేషన్ క్యాంపు వివరాలు యాప్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: