అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మొండి ఘటమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్ 3న ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే బిడెన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ట్రంప్పై బిడెన్ 8శాతం ఆధిక్యంలో ఉన్నట్లు కొన్ని సర్వేలు చూపిస్తుండటం విశేషం. ఇలాంటి తరుణంలో మరో కీలక నిర్ణయం వెలువడింది. 77 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన బిడెన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా డిజిటల్ పబ్లిసిటీ చేపట్టేందుకు చీఫ్గా ఇండో-అమెరికన్ మేధా రాజ్ను నియమించారు.
జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మేధా రాజ్.. స్టాన్ఫర్ట్ విశ్వవిద్యాలయం నుండి ఏంబీఏలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చదివారు. 2016 హిల్లరీ క్లింటన్ ప్రచారంలో క్లార్క్ పనిచేశారు. డిజిటల్ విభాగానికి సంబంధించిన అన్ని అంశాలపై మేధా రాజ్ పనిచేస్తారని బిడెన్ ఎన్నికల ప్రచార అధికారులు వెల్లడించారు. ప్రచార ఫలితాలను మరింత ప్రభావవంతం చేయడమే వీరి పని. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి ఎన్నికల ప్రచారం పూర్తిగా వర్చువల్గా కొనసాగనున్నందున మేధారాజ్కు కత్తి మీది సాము కానుంది.
జో ప్రచారం బాధ్యతను స్వీకరించిన తరువాత లింక్డ్ ఇన్లో మేధా రాజ్ స్పందిస్తూ "ఎన్నికలకు ఇంకా 130 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేం ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది`` అని తన వ్యూహాన్ని ఖరారు చేశారు. మేధా రాజ్ గతంలో పీట్ బుటిగిగ్ ఎన్నికల ప్రచారంతో సంబంధం కలిగి ఉన్నారు. బుటిగిగ్ కూడా ఇప్పుడు బిడెన్కు మద్దతుగా నిలిచాడు. బిడెన్ ప్రచారానికి డిప్యూటీ డిజిటల్ డైరెక్టర్గా క్లార్క్ నియమించినట్లు బుటిగిగ్ చెప్పారు. సామాన్య ప్రజల నుంచి నిధులు సేకరించడం వీరి బాధ్యతగా ఉంటుంది. భారతీయుల సత్తా ఈ ప్రచారంతో స్పష్టం కానుందని పలువురు పేర్కొంటున్నారు.