ప్రపంచం మొత్తం ఓ వైపు ఉంటే.. చైనా, పాకిస్థాన్ మాత్రం మరోవైపు ఉన్నాయి. ప్రపంచంలో కరోనాతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్న విషయం తెలిసిందే. అయితే చైనా, పాకిస్థాన్ మాత్రం పక్కదేశాలను ఆక్రమించుకోవాలన్న తపనతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా భారత్ తో కయ్యానికి దువ్వుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు చైనా, పాకిస్థాన్ తీరు పట్ల పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్ వాసులు నిరసనలు చేపట్టారు. అక్కడ నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చెపడుతున్నారు.
చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ రెండు నదులపై ఆనకట్టల కోసం ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా, పాక్ కుమ్మక్కయి నీలం జీలం, కోహ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని.. వాటిని ఆపే వరకు అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి ఎంతో హాని ఉండబోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) కింద పీవోకేలోని జీలం నదిపై హైడ్రో పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం.. చైనాకు చెందిన ఓ కంపెనీ 1,128 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ను 92.9 బిలియన్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.