ఆర్టీసీ.. నిన్న మొన్నటి వరకూ ఇదో ప్రభుత్వ రంగ సంస్థ.. ఇప్పుడు ఏపీలో ఇది ప్రభుత్వరంగ సంస్థ.. ఈ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే. అయితే తెలంగాణలో మాత్రం ఆర్టీసీ ఇంకా కార్పోరేషనే కానీ.. ప్రభుత్వంలో విలీనం కాలేదు. ఆ డిమాండ్ ను కేసీఆర్ ఒప్పుకోలేదు. పాపం.. రెండు నెలలపాటు సమ్మె చేసినా కేసీఆర్ దిగిరాలేదు.
కానీ ఇటు ఏపీలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశాడు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఆర్టీసీని కరోనా దెబ్బ కొట్టేసింది. నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా పరిమిత సంఖ్యలోనే తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా కట్టడి కోసం కూడా జగన్ ఆర్టీసీని కొంత మేర వినియోగిస్తున్నారు.
అదేలా అంటారా.. ప్రస్తుతం కరోనా కారణంగా ఏసీ బస్సులు తిరగడం లేదు. అందుకే.. ఇంద్ర బస్సులను తాత్కాలికంగా కరోనా పరీక్ష కేంద్రాలుగా మారుస్తున్నారు. ఏపీలో ఇంద్ర ఆర్టిసి బస్ లను సంజీవని బస్ లుగా మార్చామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. వీటి ద్వారా కరోనా నిర్దారణ పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. ఇప్పటివరకు 21 సంజీవని వాహనాలు ఏర్పాటు చేశారు.
రానున్న 10 రోజుల్లో మరో 30 వాహనాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని అన్ని జిల్లాలకు పంపిస్తారు. ఆర్టీసీని గతంలోనూ ఇతర అవసరాల కోసం వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికే సంచార రైతు బజారు కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించారు. వీటిలో ఆర్టీసీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఆర్టీసీని వివిధ ప్రజాసేవాకార్యక్రమాల కోసం వినియోగిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.