చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్లో ఐఫోన్ల తయారీ పెంపునకు యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం యాపిల్ ఫోన్లను తయారు చేసే ఫాక్స్కాన్పై ఒత్తిడి పెంచడం వల్ల.. ఆ సంస్థ భారత్లో ఉత్పత్తి పెంపునకు రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న 'ఫాక్స్కాన్' సంస్థ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. యాపిల్ సంస్థకు ఐఫోన్లు తయారు చేసేందుకు భారత్లో.. బిలియన్ డాలర్లు (రూ.7.5 వేల కోట్ల పైమాటే) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది. ఈ కథనం ప్రకారం తమిళనాడులో ఫాక్స్కాన్కు ఇప్పటికే ఉన్న ఐఫోన్ల తయారీ ప్లాంట్ను విస్తరించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది.
ఇటీవల అమెరికా, చైనా మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యాపిల్ ఫోన్లకు చైనా అతిపెద్ద తయారీదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని యాపిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారత్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఫాక్స్కాన్కు చైనా బయట ఉత్పత్తి పెంచమని ఒత్తిడి కూడా పెరిగినట్లు సమాచారం. ఫలితంగానే భారత్లో ఈ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని శ్రీపెరుంబదూర్ ప్లాంట్లో ఐఫోన్ ఎక్స్ఆర్, యాపిల్ బడ్జెట్ ఫోన్ క్లాస్-ఐఫోన్ వంటి మోడళ్లను తయారు చేస్తోంది. ఐఫోన్ ఎస్ఈ, ఇతర పాత మోడళ్లనూ తయారు చేసేది. అయితే వీటి తయారీని యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే నిలిపివేసింది.ఈ ఏడాదే విడుదల చేసిన ఎస్ఈ 2020ని కూడా ఇక్కడ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కొత్తగా వచ్చే పెట్టుబడులతో ఈ ప్లాంట్లో మరో 6,000 మందికి ఉపాధి కల్పించే వీలుందని ఫాక్స్కాన్ ప్రతినిధులు తెలిపారు.భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షియోమీ ఫోన్లను కూడా దేశీయంగా ఫాక్స్కాన్ సంస్థే తయారు చేస్తోంది.