కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసును... కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన సంగతి తెలిసిందే.. కేరళలో జులై 4న యూఏఈ ఎంబసీకి చెందిన పార్శిల్లో... 15 కోట్ల రూపాయల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం దొరకడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసు తో ప్రతిపక్షాలు పినరయి విజయన్ సర్కారును ఇరుకునే పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో స్వప్న సురేశ్ను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎం ప్రధాన కార్యదర్శి శివ శంకర్పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా వేశారు.
ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సిఫార్సు మేరకు ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా కేరళలో సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులు స్వప్న సురేశ్, సందీప్ నాయర్లకు కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో తేలింది. నిందితులు ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం జుడీషియల్ కస్టడీకి పంపించనున్నారు.
అలువాలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్వప్న సురేశ్, సందీప్ నాయర్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి, వారిని మొదట క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇక బెంగళూరులో నిందితులనున ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని స్వరాష్ట్రానికి తరలించారు. సోమవారం వీరిని కోచిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరు పర్చి 10 రోజుల పాటు జుడీషియల్ రిమాండుకు తరలిస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేరళాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.