గత కొంత కాలంగా విశాఖ పట్టణం భయంతో వణికిపోతుంది. ఓ వైపు కరోనా వైరస్ తో బాధపడుతుంటే.. మరోవైపు భూకంపాలు.. తుఫాన్లతో సతమతమవుతున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం మే 7న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు లీక్ అయ్యి విశాఖను పెను విషాదంలోకి నెట్టేసింది. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్జీ ప్లాంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత స్టైరీన్ గ్యాస్ లీక్ కావడంతో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు నిబంధనలుకు అనుకూలంగా ఉన్నాయా అంటే అనుమానాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం ఫార్మా సిటీలో సాల్వెంట్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. సీఈటీపీ సాల్వెంట్ను రీసైల్ చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. సాల్వెంట్ స్టోర్ చేసే రియాక్టర్ ట్యాంకులో పేలుడు జరిగింది. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మా సిటీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు (40) మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు మాత్రమే ఉన్నారని, వీరిలో ముగ్గురు స్వల్పంగా గాయపడగా, మల్లేశ్ (33) తీవ్రంగా గాయపడినట్టు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఉదయం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని శిథిలాల మధ్య గుర్తించారు. నిజానికి పేలుడు జరిగిన సమయంలో నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారని విశాఖ సాల్వెంట్స్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ నిజానికి ఆ సమయంలో 15 మంది వరకు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి ఇటు యాజమాన్యం కానీ, అటు పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.