అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. మనదేశంలో లాజిక్ ల కంటే మ్యాజిక్ లను ఎక్కువగా నమ్ముతారు. అందుకే సైంటిస్ట్ ల కంటే స్వామీజీలు ఎక్కువయ్యారు అని. ఇది నిజమే అందుకే ఈ డైలాగ్ ను చాలామంది జీర్ణం చేసుకోలేకపోయారు. త్రివిక్రమ్ రైమింగ్ తో రాశాడు కాబట్టి డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద కంటే... కాషాయం కట్టుకొని తపస్సు చేసుకొనే స్వామీజీలపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు వస్తే సమయం లేదని చెప్పి పంపించే నాయకులు... సమయం దొరికినప్పుడల్లా స్వామీజీల వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కి వస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా..
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ఫలితాలను పలు సర్వేలు రిలీజ్ చేశాయి. వీటిల్లో చాలా వరకు ప్రజలు వైకాపాకు పట్టం గట్టారని, వైకాపా గెలుపు ఖాయం అని ఇచ్చాయి. గెలుపుపై నమ్మకంతో జగన్ అండ్ కో అప్పుడే ప్రమాణ స్వీకారం గురించి, మంత్రి వర్గం గురించి చర్చలు జరుపుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదట దృష్టి సారించేది పాలనకు సంబంధించిన అధికారులపైనే.
ఎందుకంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పాలనా అధికారులు జగన్ ను ఎలాంటి ఇబ్బంది పెట్టి ఉంటారో ఆయనకు తెలుసు కదా. అందుకే ముందు వాళ్లపై దృష్టి పెట్టె అవకాశం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు శంషాబాద్ లోని చిన్నజీయర్ స్వామిజీని కలిసి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక, తమకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని స్వామిజి ఆశీర్వాదం తీసుకొని వెళ్లారట. అంతకు ముందు జగన్ కూడా చిన్న జీయర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే, సమయం దొరికినప్పుడల్లా చిన్న జీయర్ స్వామిజి కలుస్తుంటారు. అది అసలు సంగతి.