పోలింగ్ ముగిసింది..ఓట్ల లెక్కింపే మిగిలింది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా జాతీయ స్థాయిలో పేరున్న నారా చంద్రబాబు నాయుడు ఏపీలో తిరిగి పవర్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తోందని..సర్వేలు ఎంతగా బాకాలు ఊదినా ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన అంటున్నారు. మరో వైపు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేనంతగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆనందాన్ని తట్టుకోలేక పోతున్నారు. తండ్రి చనిపోయినప్పుడే ఉమ్మడి ఏపీకి సీఎం కావాలని ఎమ్మెల్యేలతో సంతకాలు కూడా చేయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు.
జగన్ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. బీజేపీతో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత తన ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్లో గులాబీ బాస్ కేసీఆర్తో చెలిమి చేశారు. ఎంఐఎం కూడా ఆయనకే వత్తాసు పలికింది. పసుపు కుంకుమ, రైతుబంధు పథకాల వల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరిందని, అంతేకాక లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇచ్చామని , అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని అవే తమను గట్టెక్కిస్తాయని నమ్మకంగా ఉన్నారు చంద్రబాబు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని , ఏపీని అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చేశామని ఇక ఫలితాల కోసం వేచి చూస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రకటించిన సర్వే సంస్థలన్నీ జగన్కు జనామోదం తెలిపారని, ఆయనే ఏపీ సీఎం కాబోతున్నారని వెల్లడించాయి. బాబు డోంట్ కేర్ అంటున్నారు. కొద్ది రోజులు ఆగితే వాస్తవేమిటో తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు లోటస్ పాండ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా జగన్ స్వాములను దర్శించుకుంటూ..వారి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలోనే గడిపిన జగన్ను జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారి దగ్గరకు వెళ్లేలా చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవాలయాన్ని సందర్శించారు. తాను అందరివాడిననే అభిప్రాయాన్ని కలిగించేందుకు జగన్ ప్రయత్నం చేశారు.
మరో వైపు చంద్రబాబుపై విశాఖలోని శ్రీ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ బాబు కంటే ఎక్కువగా ఆలయాలను పరిరక్షిస్తున్నారని, హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నారంటూ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడలోని కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత శారదా పీఠంకు వెళ్లారు. అక్కడ స్వామి వారి ఆశీస్సులు పొందారు. భోజనం చేసి తిరిగి వచ్చారు. కేసీఆర్కు అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. మరో వైపు బాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సవాల్ విసిరారు. జగన్, పవన్ ను తన వైపు ఉండేలా చక్రం తిప్పారు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ను చీల్చి చెండాడిన గులాబీ బాస్ ఇపుడు రా రమ్మంటూ పిలిచారు. ఇక ఏపీలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోతున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై అంచనాలకు మించి బెట్టింగ్లు జోరందుకున్నాయి. తాను సీఎం కావడం ఖాయమని, ఇక కేబినెట్ లో ఎవరుండాలనే దానిపై జగన్ సమాలోచనలు చేస్తున్నారు. బొత్స, విజయసాయి రెడ్డి, రామకృష్ణా రెడ్డి, తదితరులకు కంపల్సరీ బెర్త్ దక్కే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు మాత్రం కూల్గా ఉన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఏది ఏమైనా కొద్ది గంటలు ఆగితే బండారం బయట పడుతుంది. ఎవరు గెలిచినా ఓడేది మాత్రం జనమే.