కాదేదీ దోపిడికి అనర్హం..అన్నట్లుగా దోపిడి చేయడానికి చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి వీలైతే కొండనైనా దోచేద్దామనుకుంటారు దోపిడి రాయుళ్లు. తాజాగా కొంత మంది దొంగలు ఏకంగా బ్రిడ్జీకి ఉపయోగించే ఇనుమునే దొంగతనం చేసి సంచలనం రేపారు. వివరాల్లోకి వెళితే..రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంబా నదిపై ఇటీవల కొత్త వంతెన నిర్మించారు. కొత్త వంతెన నిర్మించడంతో పాత వంతెన అలాగే ఉండిపోయింది.
దాంతో ఆ పాత వంతనపై దొంగల కన్ను పడింది. అంతే ఓ మంచి ముహూర్తం చూసుకుని రంగంలోకి దిగారు. వంతెనలోని రెండు పిల్లర్ల మధ్య 75 అడుగుల నిడివి ఇనుము ఉండగా, దాన్ని మొత్తం కూల్చేసి ఇనుము మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. ఆ ఇనుము మొత్తం సుమారు 56 లన్నులు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
రెండు పిల్లర్ల మధ్య ఖాళీగా కనిపిస్తుండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వర్షాలు, వరదల కారణంగా ఇది కూలిపోయి ఉంటుందని మొదట అనుకున్నా, ఆ తర్వాత అది దొంగల ఘనకార్యం అని తెలిసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.