ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న పటాస్ షో మరోసారి వివాదాస్పదమైంది. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుపుపై కార్యక్రమంలో పాల్గొన్న మహీధర అనే కమెడియన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. జగన్ ను గెలిపించడం ఏపీ ప్రజలు చేసిన తప్పు అని అర్థం వచ్చేలా మాట్లాడాడు.
ఈ ఎపిసోడ్ ప్రసారం కావడంతో వైసీపీ అభిమానులు పటాస్ షో పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు స్కిట్లు చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. ఈ ఎపిసోడ్ వివాదాస్పదం కావడంతో సదరు మహీందర్ అనే కమెడియన్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.
ఈ ప్రోగ్రాం కు యాంకర్గా వ్యవహరిస్తున్న రవి పై కూడా వైసీపీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ షోలో మహీధర చేసిన కామెంట్లకు యాంకర్ రవి చప్పట్లు కొడుతూ అభినందించడం వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. పటాస్ అనేది లైవ్ షో కాకపోవడం వల్ల నిర్వాహకులు కావాలని ఈ కాంట్రవర్సీ స్కిట్ ఎడిట్ చేయకుండా ఉంచేసినట్టు వైసీపీ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని విజయం సాధించిన సమయంలో ఇలాంటి స్కిట్లు కచ్చితంగా వివాదాస్పదం అవుతాయి. ఈ విషయం తెలిసి కూడా ఇలాంటి సున్నితమైన విషయాలపై స్కిట్లు చేయటం... దాన్ని గుడ్డిగా ప్రసారం చేయడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పాలి.