తెలుగుదేశంను వీడిపోతున్న నాయకులు ఆ పార్టీ నడుస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ కుమార్ యువనేత నారా లోకేశ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లోకేష్ వల్లే తెలుగుదేశం ఓడిపోయిందని సతీష్ కుమార్ ఆరోపించారు.


తెలుగుదేశం పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోయాక గ్రూపులను తయారుచేశారని ఆయన ఆరోపించారు. ఓ రాజకీయ పార్టీని హెరిటేజ్‌ సంస్థలా మార్చారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని అన్నం సతీశ్ కుమార్ అన్నారు.


కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని సతీశ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్‌ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని సతీష్ ఘాటుగా విమర్శించారు.


నారా లోకేశ్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీశ్ సవాల్‌ విసిరారు. అంతే కాదు.. ఎన్నికల్లో లోకేశ్ పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి చట్టసభల్లో కూర్చోడానికి లోకేష్‌కు సిగ్గుండాలని సతీష్ ఘాటు విమర్శలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: