రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నారా రావడం లేదా అన్నది ఇప్పటికే సందేహంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లోకి రావాలని రజినీకాంత్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఒక్కసారి అడుగుపెడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. కానీ ఎందుకో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు.
సినిమాల్లో అందరు ఆదరిస్తారు.. రాజకీయాల్లోకి దిగితే మిత్రులకంటే శత్రువులే ఎక్కువగా ఉంటారు. అదే రజిని భయం కావొచ్చు. గతంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నానని, 2021 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి రజిని పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇది ప్రకటించి చాలా రోజులైంది.
ఇప్పటి వరకు పార్టీ ప్రకటన లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం రెండేళ్ల ముందునుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే, ఇప్పుడు రజిని చుట్టూ మరి వల అల్లుకుంది. ఇటీవల వెంకయ్యనాయుడు రాసిన పుస్తకం రిలీజ్ చేసే సమయంలో రజినీకాంత్ బీజేపీ గురించి అనేక విషయాలు మాట్లాడారు.
జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. మోడీ షాలను కృష్ణార్జులతో పోల్చారు. దీంతో రజినీపై విమర్శలు మొదలైయ్యాయి. రజినీకాంత్ బీజేపీ దగ్గరవుతున్నారని ప్రచారం జరిగింది. రజిని బీజేపీలో జాయిన్ అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజినీకాంత్ ను ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే, దీనిపై రజినీకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాలమే సమాధానం ఇస్తుంది అని చెప్పి సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే శివ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. బహుశా ఈ రెండు సినిమాల తరువాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.