భారత దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకు వెళుతుంది. భారత్ ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా భారత్ వైపు చూడటం మొదలు పెట్టాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై చైనాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపే విషయంలో భారత్ తమ కంటే ముందు ఉందని చైనా పేర్కొంది. భారత్ ను స్ఫూర్తిగా తీసుకొని అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా నిర్ణయించింది.
ఇప్పుడు భారత్ కూడా అగ్రదేశాలతో పోటీ పడుతోందని షాంఘై ఇంజినీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోశాటిలైట్స్ డైరెక్టర్ జాంగ్ యోంగే చెప్పారు. ఎప్పుడూ భారత్ పై కస్సుబుస్సులాడే చైనా తొలిసారి భారత్పై ప్రశంసలు కురింపించింది. ఇస్రో చేసిన అద్భుత ప్రయోగంపట్ల అక్కడి మీడియా భారత్ను పొగడ్తల్లో ముంచెత్తింది.
చైనా కంటే ముందుగా అంగారకగ్రహం మీదికి ఉపగ్రహాన్ని పంపిన భారత్ ఇప్పుడు సింగిల్ రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించి మంచి అవకాశాన్ని సాధించిందని జాంగ్ తెలిపారు. భారత్ గత బుధవారం సాధించిన ప్రయోగం అంతరిక్ష కార్యక్రమాల్లో దాని తాజా విజయంగానే చెప్పాలని అంగీకరించారు. 2014లో అంగారక గ్రహంపైకి ఉపగ్రహ వాహకనౌకను దిగ్విజయంగా పంపిన భారత్ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కింది.