వై.ఎస్ ను జగనే చంపించారంటున్న జేసీ ప్రభాకర్..
కన్న తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని జగనే చంపించాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కన్న తండ్రినే చంపేశాడని అన్నారు. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కాపాడుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారని... సీఎం తమను ఎలా కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని సాక్షి కార్యాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు.
కేసీఆర్ను చూసి బాబు నేర్చుకోవాలంటున్న పోచారం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అని పోచారం ఆరోపించారు. నిజామాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రాష్ట్ర మంత్రుల నియోజకవర్గాల్లో టీడీపీ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు.
శ్రీనివాస్ ఘటనపై మోదీని కలుస్తానంటున్న బాబు..
అమెరికాలో శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతంపై తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భౌరంపేటలోని శ్రీనివాస్
నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఘటన అమెరికాలో అభద్రతా భావాన్ని సృష్టించిందన్నారు. ఈ ఘటనపై అమెరికా స్పందించేంత వరకు ఒత్తిడి తేవాలని అన్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈవాళ గవర్నర్తో భేటీ అయ్యారు. భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై సీఎం చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ ప్రాధాన్యాలపై గవర్నర్కు వివరించారు.
ఆంధ్రా టీడీపీ ఎమ్మెల్సీపై హైదరాబాద్ లో కేసు...
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన 3.37ఎకరాల భూమిని 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. ఈ భూమిని అయూబ్ కమలే వేరే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్టు, అటు పై వారు తమకు అమ్మినట్టు జైహనుమాన్ ట్రేడర్స్, దీపక్రెడ్డిలు నకిలీ పత్రాలు సృష్టించారు.