బోఫాల్ రైలు ప్రమాదం - ఉగ్ర దాడే...
భోపాల్లో రైలు ప్రమాదం ఉగ్రవాద చర్యేనని మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడుకు పాల్పడిన నిందితుల కోసం ఏటీఎస్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయగా, మిగతావారి కోసం గాలిస్తున్నారు. కాగా మంగళవారం ఉదయం షాజాపూర్ జిల్లా కలాపీపల్ వద్ద ప్యాసింజర్ రైల్లో జరిగిన పేలుడులో ఎనిమిదిమంది గాయపడ్డారు.
ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు..
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన భార్య వసంత తెలిపారు. విచారణ సందర్భంగా తమ వాదనలను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు. తీర్పును చూస్తే.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చింది.
లేడీ ఎమ్మెల్యేకు బూతు మెస్సేజులు...
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ ఫోన్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బూతు మేసేజ్లు వచ్చాయి. వర్షా గైక్వాడ్ ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 'చాలామంది మహిళ నేతలకు ఇలాంటి అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లోకి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్గా మారింది. మావంటి వారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య మహిళలకు వేధింపులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా' అని వర్ష అన్నారు.
దిగజారిన అమెరికా ర్యాంక్..
టాప్ దేశాల్లో తామే ముందంజలో ఉంటామంటూ ఊదరగొట్టే అమెరికాకు మరోసారి షాక్ తగిలింది. ఉత్తమ దేశాల జాబితా నుంచి మరో మూడు స్థానాలు కిందకు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాస్ వార్టన్ స్కూల్ , గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్స్ బీఏఈ కన్సల్టింగ్ భాగస్వామ్యంలో ''బెస్ట్ కంట్రీస్'' ర్యాంకింగ్స్ జాబితాను అమెరికా న్యూస్, వరల్డ్ రిపోర్టు మంగళవారం విడుదలచేసింది. ఈ రిపోర్టులో ఉత్తమ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అమెరికా మరో మూడు స్థానాలు పడిపోయి ఏడవ స్థానంలో నిలిచింది.
బెంగళూరులో టీమిండియా ఘన విజయం..
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన
ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ను 1-1తో సమం చేశాయి. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు.