ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (44) పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం గోరఖ్పూర్ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గతంలో పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 324 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలైన చిన్న పార్టీలకు దక్కాయి. నాలుగింట మూడొంతులకు మించిన మెజారిటీ సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి మాత్రం కాస్త ఆలస్యమైంది.
ఆగ్రాలో జంట పేలుళ్లు...
తాజ్మహల్పై ఉగ్రదాడులు జరిపే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆగ్రాలోని శనివారంనాడు రెండు వరుస బాంబు పేలుళ్ల ఘటనలు కలకలం సృష్టించాయి. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. తక్కువ తీవ్రతతో జరిగిన ఈ పేలుళ్లలో ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. చెత్తవేసే ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్లు శుభ్రం చేస్తుండగా తొలి పేలుడు సంభవించింది. రెండో పేలుడు ఒక ఇంటి పైకప్పుపై చోటుచేసుకుంది.
ఎన్కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి...
ఛత్తీస్గఢ్ దంతెవాడ అటవీప్రాంతం మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బర్దూమ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలిలో ఏకే 47తో సహా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కేరళలో మహిళ కీచక చర్య!
దేశంలో మైనర్ బాలలపై లైంగిక అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో 13 ఏళ్ల బాలికపై ఓ మహిళ కీచకంగా ప్రవర్తించింది. బాలికను లైంగికంగా వేధించి తన వికృతబుద్ధిని చాటుకుంది. కొచ్చిలోని పల్లురుథీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీచకంగా ప్రవర్తించిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు పోలీసు కస్టడీ విధించింది.
ట్రంప్ ‘కంపు’ ప్రవర్తన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలి సమావేశం మోటుగా మొదలై గందరగోళంగా ముగిసింది. ఈ సంయుక్త సమావేశం సందర్భంగా వాణిజ్యం, రష్యా, ఇమ్మిగ్రేషన్, వైర్ ట్యాపింగ్ తదితర అంశాలు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి. తమ మధ్య ఉన్న విభేదాలను దాచిపెట్టేందుకు ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్తకు సారథ్యం వహిస్తున్న ఏంజెలా మెర్కెల్, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇదే తొలిసమావేశం కావడంతో.. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే సమావేశంగా అందరూ భావించారు.