ప్రజలను దోచుకోవటమే కాదు పశువులను దోచుకోవటమూ బీహార్ ముఖ్యమంత్రికే కాదు వారి పత్నిపుత్రులకూ బాగా తెలుసు. బుకాయింపులూ ఇంపుగా చెయ్యగలరు లాలు ప్రసాద్ యాదవ్. మాటల్లో చాతుర్యం ఎంతగానో ఉన్న లాలూ యాదవ్ ముందు మన కలవకుంట్ల చంద్రశేఖర రావు "జస్ట్ ఆఫ్ట్రాల్".
"తన కొడుకులిద్దరికీ వ్యాపారం చేసే హక్కు ఉందని, వాళ్లు పేదరికంలో చనిపోవాలని తాను కోరుకోవడం లేదని" ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. బిహార్ మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ ఇద్దరికీ పట్నా శివార్లలో రెండేసి ఎకరాల భూమి ఉంది. వాళ్లతో పాటు వారి తల్లి రబ్రీదేవికి కూడా అందులో భాగస్వామ్యం ఉంది. ఆ భూమి విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు.
నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన ఓ నాయకుడు ఈ భూమిని తీసుకుని బిహార్ రాష్ట్రములోనే అతిపెద్దదైన వ్యాపారాల ఎన్నిటికో కేంద్రమయ్యేలా ఓ మాల్ కడుతున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం విలువ దాదాపు 500 కోట్ల రూపాయలు. అందులో సగం వరకు బిల్డర్ వాటాగా ఉంటుందని, మిగిలినది కంపెనీ పేరు మీద ఉంటుందని లాలు ప్రసాద్ మీడియాకు చెప్పారు.
అయితే, "ఆ భూమిని లాలు ప్రసాద్ కొడుకులు కొనలేదని, వాళ్లకు లంచంగా ఇచ్చారని" బీజేపీ నాయకుడు సుశీల్కుమార్ మోదీ ఆరోపించారు. 2008 లో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు 'హర్ష్-కొచ్చర్' అనే ఓ వ్యాపారికి పూరీ, రాంచీలో రైల్వేల తరఫున రెండు హోటళ్లు నడిపే కాంట్రాక్టు ఇచ్చారని, దానికి ముందు ఆయన పాట్నాలోని రెండెకరాల భూమిని ఆర్జెడి పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ప్రేమ్ గుప్తా భార్యకు అమ్మారని మోదీ చెప్పారు. తర్వాత కొంత కాలానికి కంపెనీ పేరు మార్చి, అందులో ముగ్గురు డైరెక్టర్ల పేర్లను చేర్చారని, వాళ్లు ముగ్గురూ లాలు యాదవ్ - తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కొడుకులు, భార్య రవ్రీ దేవి అని తెలిపారు. ప్రస్తుతం ఆ కంపెనీ పేరు లారా.. అంటే లాలు ప్రసాద్ - ఆయన ధర్మ పత్ని రబ్రీ దేవి అని చెపుతున్నారు.
లాలు ప్రసాద్ కొడుకులకు ఇలా అక్రమ మార్గంలో ఆ ఆస్తి వచ్చిందని, ఇప్పుడు వాళ్లు "వందల కోట్ల స్కాం" చేస్తున్నారని సుశీల్ మోదీ ఆరో పించారు. అయితే, కొచ్చర్ చాలా సక్రమమార్గంలోనే ఆ భూమిని అమ్మారని, అది ఇప్పుడు ఈ కంపెనీకి వచ్చిందని లాలు వాదిస్తున్నారు. కానీ అలాగైతే మంత్రులందరూ తమఆస్తులు వెల్లడించాల్సి ఉండగా, లాలు కొడుకులు ఈ భూమి విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదని సుశీల్ మోదీ ప్రశ్నిస్తున్నారు.
అధికారములో ఉన్నవారు అత్యున్నత పదవులను అలంకరించిన వారు వివాదాస్పదాశాలకు తావివ్వరాదన రాజకీయ సంస్కృతి చెపుతుంది. నేరం చేయక పోవటమేకాదు, నేరం చేయరు అనిపించేలా నాయకులు ఉండాలని తప్పులు చేయక పోవటమే కాదు అలా అనుమానం కూడా ప్రజలకు రానంత నిబద్దత తో రాజ్యపాలన చేయాలని 2500 సంవత్సరాల క్రితమే చాణక్యుడు తన అర్ధశాస్త్రములో విశదీకరించారు.
మోసం, దగా మార్గము లో డబ్బు సంపాదించటానికి విద్యాబుద్దులు, సంస్కారం, సాంప్రదాయం, సంసృతి అవసరంలేదని - మరో సారి లాలు ప్రసాద్ యాదవ్ తన మాటలతో బహు చమత్కారం గా అభివర్ణించారు. నీతి లేని ఇలాంటి నాయకులను బహిరంగ విచారణ చేసి శిక్ష విధించాలని బీహార్ ప్రజలు అంటున్నారు.