అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు చెరువు లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్యం 14 కి చేరింది. చెరువులో ప్రయాణిస్తున్న తెప్ప బోల్తా పడటంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందాగా ,మరో నలుగురు గల్లంతు అయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి పరిటాల సునీతతో ఆయన మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయని మంత్రి సునీత మీడియాతో చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కాగా ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు.
బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారులు, పోలీసు యంత్రాంగం సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తమ ఇంటికి శుభకార్యానికి వచ్చిన అతిథులు అకాల మృత్యువాత పడటంతో రామన్న కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు.