సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి మొదలైనట్టు కనిపిస్తోంది. ఎన్నికల సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు ఏపీ ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ రైతు దీక్ష నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ రేంజ్లో మండిపడ్డారు.
చంద్రబాబు కొందరు చెంచాగాళ్లు, పకోడి గాళ్లను పెట్టుకుని జగన్ను తిట్టించే కార్యక్రమం పెట్టుకున్నారని కొడాలి నాని మండిపడ్డారు. జగన్పై అవాకులు, చవాకులు పేల్చితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. చంద్రబాబుకు నిజంగా సిగ్గూ, శరం ఉంటే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకూ, జగన్ కూ ఉన్న తేడాలని పోలుస్తూ నాని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకున్నారని.. కానీ జగన్ ధైర్యంగా కాంగ్రెస్ విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారని నాని అన్నారు. చంద్రబాబుది దున్నపోతు ప్రభుత్వమని విమర్శించిన నాని.. ఆ దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే జగన్ దీక్ష చేయాల్సి వచ్చిందని గుంటూరు రైతు దీక్షలో వివరించారు.
తన ప్రసంగంలో నాని ఓ విచిత్రమైన ప్రతిపాదన ఉంచారు. దమ్మంటే చంద్రబాబు టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, సొంతంగా పార్టీ పెట్టాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. కొందరు అధికారుల తీరుపైనా మండిపడిన నాని.. వారు
ఒల్లుదగ్గర పెట్టుకోకపోతే.. తాము అధికారంలోకి వచ్చాక అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.