తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాంచి జోరు మీద ఉన్నారు. కేసీఆర్ సర్కారుపై ఒంటి కాలిపై లేచే ఆయన మరోసారి అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు.
అందులోనూ కాంట్రావర్సీ విషయాలను బయటపెట్టి అందరిలోనూ ఆసక్తి రేపారు రేవంత్ రెడ్డి. మంచు లక్ష్మి మొదటి భర్త గురించి కేటీఆర్ గురించి హాట్ కామెంట్స్ చేశారాయన.
మంచు లక్ష్మీ మొదటి భర్త గురించి చాలా మందికి తెలియదు. ఆ విషయానికి వస్తే మంచు లక్ష్మీ వైవాహిక జీవితం గురించి కూడా చాలా మందికి తెలియదు. పెద్దగా
తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే సెలబ్రెటీల గురించిన సమాచారం అంటే జనానికి చాలా ఇంట్రస్ట్ ఉంటుంది. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఆసక్తిగా వింటారు.
అసలు విషయానికి వస్తే.. కేసీఆర్ సర్కారు తన పరిపాలనలో ఆంధ్రావాళ్లకే పెద్ద పీట వేస్తున్నారని అంటున్నారు రేవంత్ రెడ్డి. అందుకు ఉదాహరణగా మంచు లక్ష్మీ మొదటి భర్తకు కేటీఆర్ చేసిన మేలు గురించి వెటర్నరీ విద్యార్దుల దీక్షలో పాల్గొన్న ఆయన కామెంట్ చేశారు. తెలంగాణలో ఇంత మంది ఐటీ నిపుణులు ఉండగా కేటీఆర్ తన స్నేహితుడైన లండన్ శ్రీనివాస్ అనే అతనికి ఐటీఐఆర్ సీఈవో పోస్టు కట్టబెట్టారని విమర్శించారు.
ఇంతకీ ఈ లండన్ శ్రీనివాస్ ఎవరో తెలుసా.. ఆయన మోహన్ బాబు మొదటి అల్లుడు అంటూ అసలు సంగతి చెప్పేశారు రేవంత్ రెడ్డి. ఇంత మంది తెలంగాణ ఐటీ నిపుణలు దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటుంటే.. ఐటీఐఆర్ సీఈవో పోస్టు కృష్ణా జిల్లా వాసి అయిన లండన్ శ్రీనివాస్ కు ఇచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వెటర్నరీ డాక్టర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే తమకు న్యాయం జరిగిందని వాపోతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.