తిరుపతిలోని ఎస్వీ జూపార్క్లో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఓ సింహం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. సోమవారం ఓ జిరాఫీ చనిపోయిన వార్త పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఉదయం ఆహారం తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది. 2010లో జంతు మార్పిడి కింద కోల్కతా నుంచి జిరాఫీని తిరుపతి తీసుకొచ్చారు.
జూ సిబ్బంది దీని సంరక్షణ విషయంలో అశ్రద్ధ వహించడంవల్లే చనిపోయిందని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. చాలా రోజులుగా దీనికి తోడులేదని, ఒంటరితనంగా ఫీలయిన జిరాఫీ దిగులుగా ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. తిరుపతి ఎస్వి జూపార్కు ప్రతిరోజు ఎంతో మంది వీక్షకులు వస్తూ ఉంటారని జంతు పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు అంటున్నారు.
గతంలో యంపా (22) అనే ఆడ సింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అనారోగ్యంతో మృతి చెందాయి. ఆ మద్య సర్కస్ కంపెనీల నుంచి తెచ్చిన 24 సింహాలలో యంపా ఒకటని అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఎస్వీ జూపార్క్లో జంతువుల వరుస మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై లోతుగా విచారిస్తున్నామని జూపార్కు అధికారులు తెలిపారు.