ఏపీలో విపక్ష వైసీపీకి దిమ్మతిరిగిపోయే న్యూస్ ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో ట్రెండ్ అవుతోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు పెద్ద తలకాయలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారట. జగన్ పాదయాత్రకు రెడీ అవుతోన్న వేళ ఈ వార్తలు ఆ పార్టీలో పెద్ద నైరాశ్యాన్ని నింపేలా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన మరుసటి రోజు నుంచే వైసీపీ ఖాళీ అవుతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 11 మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ వార్తలు సైలెంట్ అయ్యాయి.
తాజాగా మరోసారి ఇప్పుడు వైసీపీ నుంచి ఏకంగా ఐదుగురు పెద్ద తలకాయలు పార్టీ మారుతున్నారన్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందుకు సంబంధించి టీడీపీ కీలక నేతల నాయకత్వంలో పెద్ద ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసింది. వైసీపీకి బలమైన సీమ జిల్లాల్లో ఆ పార్టీని చాలా వరకు ఖాళీ చేసేలా టీడీపీ ఈ కొత్త ఆపరేషన్ పెద్ద ఎత్తున చేపడుతోంది. వైసీపీకి సీమలో బాగా వెన్నుదన్నుగా ఉంటోన్న రెడ్డి సామాజికవర్గం నేతలను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్లో భాగంగానే టీడీపీ ఈ స్కెచ్ గీసింది.
ఈ బిగ్ స్కెచ్ వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మంత్రాంగం నడిపినట్టు సమాచారం. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఈ వరుసలో ముందుగా పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితో ప్రారంభమయ్యే వలసలు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వరకు కంటిన్యూ అవుతాయని తెలుస్తోంది.
ఇక వీరిద్దరితో పాటు అదే కర్నూలు జిల్లాకు చెందిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా పార్టీ మారతారని పేర్లు చర్చల్లో ఉన్నాయి. వీరిద్దరితో పాటు కర్నూలు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు కడప జిల్లాలో కూడా మరో ఎమ్మెల్యే పేర్లు కూడా జంపింగ్ జలానీల జాబితాలో ఉన్నాయి. ఇక వీరు పార్టీ మారితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లందరికి టిక్కెట్లు ఇస్తామని డీల్ కుదిరినట్టు టాక్.
కర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుకకు ఎంపీ లేనిపక్షంలో ఆమె అసెంబ్లీకి మొగ్గు చూపితే అసెంబ్లీ సీటు అయినా ఇస్తామని కూడా టీడీపీ వాళ్లు ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఏపీలో వైసీపీ పూర్తిగా డౌన్ అయిపోతుండడం, మరో యేడాదిన్నరలో ఎన్నికలు ఉండడంతో వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు టిక్కెట్లు, అభివృద్ధి పనులపై ఆఫర్లు వస్తే పార్టీ కండువాలు మార్చేందుకు పెద్ద ఎత్తున రెడీగా ఉన్నారు. ఏదేమైనా ఒకటి రెండు నెలల్లో ఏపీ రాజకీయాలు మరింత హాట్గా మారడం ఖాయంగా కనిపిస్తున్నాయి.