అవును! ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే.. జనసేన, వైసీపీ పార్టీల పరిస్థితి ఏంటి? ఈ పార్టీలు ఎంత మేరకు నిలదొక్కుకుని నిలబడతాయి? ఎంత మేరకు సక్సెస్ సాధిస్తాయి? జనాలను, వారి ఓట్లను ఎంత మేరకు బుట్టలో వేసుకుంటాయి? ఇప్పుడు దాదాపు అందరిలోనూ ఇవే ప్రశ్నలు ఉన్నాయి. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు పూర్తయింది. మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నట్టు ఇంకా ముందే ఎన్నికలు వచ్చినా నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో.. దీంతో ఎన్నికలు వచ్చే ఏడాది ఆఖరులో వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
అంటే గట్టిగా ఓ పది నెలలన్న మాట! మరి ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్న జగన్ అండ్కో పరిస్థితి ఏమిటి? అంటే అంతా శూన్యంగానే కనిపిస్తోంది. నిజానికి ఈ మూడేళ్లలో అధికార పార్టీ అధినేత చంద్రబాబుపై జనాల్లో సింపతీ ఉన్నా.. ఆయన పరివారం, తమ్ముళ్లపై మాత్రం తీవ్ర ఆరోపణలు, దోచేస్తున్నారనే కామెంట్లు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. మరి వీటిని ఎండగట్టి తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లడంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టాయి.
విజయవాడలో కాల్ మనీ బాగోతం వెలుగు చూసింది. ఈ విషయంలో అధికార పార్టీని నిలువునా ఇరికించి ఇబ్బంది పెట్టాల్సిన ప్రతిపక్షం తనే ఇరుక్కుని తన పార్టీ ఎమ్మెల్యే రోజానిఏడాది పాటు సస్పెండ్ అయ్యేలా పనికిమాలిన వ్యూహం రచించింది. దీంతో వైసీపీ విఫలం అనే కామెంట్ బాగా వినిపించింది. ఇక, నంద్యాలపోరు కూడా విఫలమైంది. నోరు అదుపులో ఉండదు, జగన్ అంతే! అనే నిర్ధారణ వచ్చేలా జగన్ వ్యవహరించారు. దీనివల్లసాధించింది ఏమీలేదు. సో.. జగన్ పుంజుకోవడం మానేసి.. జనాల అభిమానాన్ని తెంచుకునే పనిలో ఉన్నట్టు స్పష్టమైంది.
ఇక, జనసేన పరిస్థితిని చూస్తే.. 2014లో ప్రశ్నిస్తానంటూ అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణ నిధులు వంటి వాటిపై పెద్దగా ప్రశ్నించినా ఎలాంటి సమాధానం రాబట్టలేక పోయారనే అపవాదు ఉంది. అయితే, అదేసమయంలోకి కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళితే పరిష్కారం అవుతాయి అనే అభిప్రాయం మాత్రం కలిగించారు.
అయితే, పార్టీని 2019 ఎన్నికల్లో పోటీకి పెడతానని చెబుతున్నా.. ఇప్పటికైతే.. పార్టీ నిర్మాణం జరగలేదు. సిద్ధాంతం ఏమిటో? ఏదిశగా ముందుకు వెళ్తారో కూడా తెలియదు.. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరా.. కూటమితో జతకడతారా? అన్నది తెలియదు! సో.. జనసేన పరిస్థితి ఇదీ! కాబట్టి అంతా చిందరవందర గందరగోళం. దీనిని బట్టి ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే.. అధికార టీడీపీకే కాస్త మైలేజ్ ఉంది. అయితే దీనిని ఎన్నికల వరకు టీడీపీ నిలుపుకుంటుందా అన్నది ఓ ప్రశ్న అయితే ? అప్పటకీ వైసీపీ, జనసేన ఎలా పుంజుకుంటాయన్నది కూడా చూడాలి.