తెలంగాణలో తాము బలంగా ఉన్నామని, రేవంత్ వంటి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం లేదని ప్రకటించిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ వ్యాఖ్యలు నగుబాటు అవుతున్నాయి. ఒక్కొరొక్కరుగా కాదు.. ఇటీవలి పరిణామాలను చూస్తే.. గంప గుత్తగా టీడీపీ తెలంగాణలో ఖాళీ అయిపోతోంది! నిజానికి రేవంత్ వెళ్లిన పరిస్థితిని గమనిస్తే.. అప్పట్లోనే అందరూ కాంగ్రెస్ బాట పడతారని భావించినా.. ఎందుకో.. రాజకీయ సమీకరణలు తల్లకిందులై.. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ బాట పడుతున్నారు నేతలు. ఇప్పుడు ఏకంగా జిల్లాలకు జిల్లాల్లోనే టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ హవా కొనసాగింది. అయితే, రాజకీయలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా? పరిస్థితి మారిపోయింది. నేతల గోడ దూకుళ్లు పెరిగిపోయాయి. దీంతో జిల్లాలో పార్టీ బలహీనమైంది. అయినా కొందరు సీనియర్లు ఇప్పటి వరకు టీడీపీని నమ్ముకుని ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరటంతో.... జిల్లాలో పార్టీని తమ భుజాల మీద నడిపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఆర్మూర్ ఇంఛార్జ్ రాజారాం యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరటంతో ప్రస్తుతం జిల్లాలో టీడీపీ పరిస్థితి జెండా మోసే దిక్కులేకుండా పోయింది.
అటు కామారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ పార్టీని నడిపించే వారే కరువయ్యారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీడీపీని నడిపించే నాయకులు కరువయ్యారనే చెప్పవచ్చు. ప్రధాన నేతలంతా సైకిల్ దిగి ఇతర పార్టీల్లోకి చేరడంతో వారితో పాటు అనుచరులు కూడా పార్టీని వీడి వారి వెంటే పార్టీల్లో చేరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ మాత్రమే టీడీపీలో ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా ఈ ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా పని చేయట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండవతో పాటు అన్నపూర్ణమ్మకి ఉమ్మడి జిల్లాలో పార్టీపై గట్టి పట్టుంది. సైకిల్ పార్టీ నేతలుగా వీరికి మంచి పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు పార్టీని నడిపించే పరిస్థితుల్లో లేరు. అన్నపూర్ణమ్మ కొడుకు బాల్కొండ నియోజకవర్గంలో అనుచరులను కలుస్తున్నా.. ఇది వ్యక్తిగతంగానే తీసుకుంటున్నారు తప్ప పార్టీ పరంగా వారు చెప్పుకోవట్లేదు. మండవ వెంకటేశ్వరరావు సైతం కొన్ని రోజుల్లో గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. దీంతో వీరిద్దరు కూడా త్వరలోనే పార్టీకి ఝలక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.