ప్రధాని నరెంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ను ఆ దేశ 130 కోట్ల ప్రజలందర్నీఏకం చేయడంలో మోదీ విజయ వంతంగా ముందుకు సాగుతున్నారని ఆయన కొనియాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అద్భుతమైన వృద్ధి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. వియత్నాంలో జరుగు తున్న ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ (ఏపెక్) చీఫ్ ఎగ్జిక్యుటివ్స్ సదస్సులో ఆయన ఒకవైపు భారత్ను పొగుడుతూనే, మరోవైపు చైనా తీరును తప్పుపట్టారు.
"భారత్ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరిచినప్పటి నుంచి అందరినీ ఆశ్చర్యపరిచేలా వృద్ధి సాధించింది. వేగంగా విస్తరిస్తున్న మధ్య తరగతి వర్గానికి కొత్త అవకాశాల్ని కల్పించింది. భిన్న సంస్కృతులతో కూడిన అతి పెద్ద ప్రజాస్వామ్య సువిశాల దేశ ప్రజల్ని ఒక్కటి చేయడంలో మోదీ శ్రమ అభినందనీయమని " డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి అవుతున్నదని, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారని అన్నారు. చైనా ప్రతినిధుల ముందే భారత ప్రధాని నరెంద్ర మోడీ పై ప్రసంశల జల్లు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నరెంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధిస్తోందని ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించారు. "ఏపెక్ కూటమి" లో లేని దేశాలు కూడా ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. భారత ప్రజలను ఏకతాటిపై తెచ్చారనీ ట్రంప్ ప్రశంసించారు. అంతేగాక, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారని కీర్తించారు. అభివృద్ధికి కృషి, ప్రస్తుతం ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్, వియాత్నాం వేదికగా జరుగుతున్న ఆసియా ఫసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ (అపెక్) సదస్సులో ప్రసంగించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశంతోనైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
భారతీయులు సోదర భావం కలిగి ఉంటారని అదే భారత ప్రజల్లో తనకు నచ్చే అంశమని ఆయన అన్నారు. ఆగష్టు నెలలో మోడీ తనతో సమావేశమైనప్పుడు కూడా అదే సోదర భావాన్నే వ్యక్త పరిచారని గుర్తుతెచ్చుకున్నారు.
అదే సమయంలో చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానాల్ని ట్రంప్ తప్పుపట్టారు. చైనా అక్రమ వాణిజ్య విధానాలతో అమెరికన్ల ఉపాధి దెబ్బతింటుందని, ఈ విషయంలో అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. మరో వైపు, పాకిస్తాన్ లో ఎలాంటి ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలు లేవనే నిర్ధారణను అమెరికా కోరుకుంటుందని, ఆ దిశగా ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ చర్యలు చేపట్టేలా భారత్, అన్ని నాటో దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ బ్రస్సెల్స్లో వ్యాఖ్యానించారు.