టీడీపీ ఎంపీల్లో అత్యంత యాక్టివ్ గా ఉండే శ్రీకాకుళం యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థానిక రాజకీయాల నుంచి పార్లమెంటు వరకు దూసుకుపోతున్నాడు. తండ్రి ఎర్రన్నాయుడు ఆకస్మిక మృతితో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి 1.27 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా రాము ఈ మూడున్నరేళ్లలో జిల్లాలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లోను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్లో పార్టీలకు అతీతంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటు తెలుగు ప్రజలు, ఆంధ్రా సమస్యలపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
జిల్లా రాజకీయాల్లో దూసుకుపోతోన్న రామ్మోహన్ అటు పార్టీలోను కీలక పదవిలో ఉన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కోటరీలోను కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లోను మరోసారి విజయం సాధించేందుకు రామ్మోహన్ నాయుడు పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడును ఓడించడం కష్టమే అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీకి గట్టి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు పెద్ద కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసిన రెడ్డి శాంతిని జగన్ ఎంపీ సీటు నుంచి పక్కన పెట్టేసి ఆమెకు పాతపట్నం అసెంబ్లీ సీటు బాధ్యతలు అప్పగించారు. ఇక వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడిపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు లేదా తమ్మినేని సీతారాం లలో ఎవరో ఒకరిని పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. ధర్మాన సోదరుల్లో ఎవరో ఒకరిని ఎంపీగా పోటీ చేయాలని జగన్ చెపుతున్నా వారిద్దరూ కూడా అసెంబ్లీకే పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఇద్దరూ ఎంపీగా పోటీ చేయమని ముందే చేతులు ఎత్తేసినట్టే కనపడుతోంది.
జగన్ మాత్రం జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి ధర్మాననే ఎంపీగా పోటీ చేయించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ధర్మాన సోదరుల సంగతి ఇలా ఉంటే ఆముదాలవలసకు చెందిన మరో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరు కూడా పరిశీలనకు వస్తోంది. తమ్మినేని గత మూడు ఎన్నికల్లోను ఆముదాలవలసలో ఓడిపోతున్నారు. ఈ సారి ఆయన్ను అసెంబ్లీ కంటే ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుదన్న ఆలోచన పార్టీలో కొందరు జగన్కు చెప్పినట్టు టాక్. జిల్లాలో బలంగా ఉన్న కాళింగ సామాజికవర్గానికి చెందిన సీతారాం అయితే గట్టి పోటీ ఉంటుందని క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా సీతారాం పేరు పరిశీలనలో ఉంది. ఏదేమైనా టీడీపీ నుంచి రాజకీయంగా ఉద్దండులు అయిన ధర్మాన సోదరులు, సీతారాం లాంటి వాళ్ల కంటే చాలా తక్కువ అనుభవమే ఉన్న రామ్మోహన్ నాయుడును ఢీ కొట్టేందుకు వైసీపీ క్యాండెట్ ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతోంది.