ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాలుగు రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా ‘భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు’ పేరిట నాలుగు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు.
శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. కాగా, ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులో నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ సదస్సు ప్రారంభోపన్యాసం ముగియకుండానే, వచ్చిన వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం గందరగోళానికి దారితీసింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఫుడ్ ప్యాకెట్ల పంపిణీని కాసేపు ఆపాలంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని నిర్వహకులకు చురకలంటించారు.