వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్.. ప్రపంచ ఆర్థిక సదస్సు.. అసలు ఇది ఒకటి ఉందని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. బావిలో కప్పల్లా కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుని.. ఆ ట్రెండ్ ప్రకారం ఫాలో అవడం అంటే చంద్రబాబుకు ఇష్టం. అలాగే కొన్ని దశాబ్దాల క్రితమే ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు పలుసార్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికలపై ప్రసంగించారు. అందుకే ఆ తర్వాత ఏపీ విభజన తర్వాత కూడా ఆయనకు ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి పిలుపు వచ్చింది. విభజన ఇబ్బందులున్నా ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు ఆయన ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ను వేదికగా మలచుకున్నారు. స్విట్జర్లాండ్ వెళ్లి ఏపీ కోసం పెట్టుబడుల ప్రచారం సాగించారు.
ఇప్పుడు అదే ట్రెండ్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫాలో అవుతున్నారు. చంద్రబాబు అయినా ముఖ్యమంత్రి అయ్యాక వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికలకు ఎక్కారు. కానీ కేటీఆర్ ఇంకా డిఫరెంట్ సీఎం కాకముందే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికగా ప్రసంగించబోతున్నారు. తెలంగాణ మంత్రి కె.తారక రామారావుకు దావోస్ లో జరిగే ఆర్దిక సదస్సుకు రావాలని ఆహ్వానం అందింది.
2018 జనవరి 17, 18 తేదీలలో ఈ సదస్సు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం తరపున ఆయన ప్రాతినిథ్యం వహిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై ఆయన ప్రజంటేషన్ ఇస్తారు. సహజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ సీఎం కాకపోయినా ఆహ్వానం అందుకున్నారు. అంటే ఒక విధంగా చంద్రబాబును ఫాలో అవుతూ.. ఇంకో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.