భారత్ దూకుడుకు చైనా హడలిపోయింది. సరిహద్దుల్లో భూభాగాలను కబళించడానికి తను చేసే ప్రయత్నాలకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూవస్తుంది. భారత్ దెబ్బకు చైనా బెంబేలెత్తి పోయింది. దీంతో అరుణాచల్ సరిహద్దుల్లో "డ్రాగన్ కంట్రీ" చేపట్టిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాన్ని బీజింగ్ అధికారికంగా ప్రకటించింది.
ఆపై 6వ తేదీన రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా చొరబాటును భారత్ ఏ మాత్రమూ సహించేది లేదని తేల్చి చెప్పారు. భారత్ ఒత్తిడితో దిగొచ్చిన చైనా, ఇక చేసేదేమీ లేక, సరి హద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట రోడ్డు రహదారి నిర్మాణాన్ని విరమించు కున్నట్టు పేర్కొంది. అంగీకరించింది.
అరుణాచల్ ప్రదేశ్ ట్యూటింగ్ ప్రాంతంలోని బిషింగ్ గ్రామం వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే చైనా నిర్మాణ పనులను నిలిపేసేందుకు అంగీకరించడంతో నిర్మాణ ప్రాంతంలో చైనా సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను భారత్ తిరిగి అప్పగించింది.
అరుణాచల్ ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లా పరిధిలో ఉంది బీసింగ్ ప్రాంతం. తొలుత ఈ ప్రాంతం తమదని, ఇక్కడ రోడ్డు వేసే హక్కు తమకుందని వాదిస్తూ, చైనా సైన్యం నిర్మాణాలు తలపెట్టగా, యంత్ర పరికరాలన్నింటినీ భారత్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ట్యూటింగ్ వద్ద సమస్య పరిష్కారమైందని, రెండ్రోజుల క్రితం సరిహద్దు అధికారుల సమావేశం జరిగిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం వెల్లడించారు. అలాగే డోక్లాం వద్ద కూడా చైనా వైపు సైన్యం సంఖ్య చాలా వరకు తగ్గిందని తెలిపారు. జనవరి 6న జరిగిన సమావేశానికి ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్స్ హాజరయ్యారని చెప్పారు.
చైనాకు చెందిన రోడ్డు నిర్మాణ సిబ్బంది బిషింగ్ గ్రామంవద్ద దాదాపు కిలోమీటరుమేర భారత్ లోపల రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీన్ని భారత సైన్యం అడ్డుకుని డిసెంబరు 28న వారి పరికరాలను స్వాధీనం చేసుకుంది. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని తమ నిర్మాణ సిబ్బందిని ఆదేశిస్తామని చైనా అధికారులు హామీ ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.