ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకూ... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూ మధ్య విబేధాలు పొడచూపుతున్నాయా.. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలంగాణపై ఎక్కువ ప్రేమ చూపుతున్నారా.. నరసింహన్ స్థానం వేరే వ్యక్తి గవర్నర్ గా ఉంటే బావుంటుందని చంద్రబాబు ఫీలవుతున్నారా.. గవర్నర్ ను మార్చాలని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారా.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానాలు కలుగకమానవు.
ఇటీవలి కాలంలో గవర్నర్ నరసింహన్ ఏపీ పట్ల చూసీ చూడనట్టు ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ పై భారతీయ జనతాపార్టీ శాసన సభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 40 నెలలు దాటినా గవర్నర్ నరసింహన్ ఏనాడూ రాష్ట్ర బాగోగులను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్రంపై గవర్నర్ నరసింహన్ సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కనీసం బిల్లులు పాస్ చేసేందుకు కూడా గవర్నర్ ఆసక్తి కనబర్చడం లేదని.. నాలా బిల్లు పెట్టి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకూ పాస్ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఇంతకీ ఈ నల్లా బిల్లు విషయంలో ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామీకరణకు మరింత ఊతమిచ్చేందుకు నాలా పన్ను తగ్గించే బిల్లుపై గవర్నర్ నరసింహాన్ ఇటీవల సందేహాలు లేవనెత్తారు. ఏపీ ప్రభుత్వం నాలా పన్ను ప్రస్తుతం ఉన్న 9శాతం నుంచి 3శాతానికి తగ్గించడం..., విజయవాడ, విశాఖల్లో 5 శాతంగా ఉన్న దీనిని 2శాతానికి తగ్గించాలని నిర్ణయిస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణలు చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ చట్ట సవరణకు ముందే ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్ననర్ కు పంపగా ఆయన సందేహాలు లేవనెత్తారు. దీంతో పాటు పలు సూచనలు కూడా గవర్నర్ ప్రభుత్వానికి చేసారు.
ఐతే.. గవర్నర్ చేసిన సూచనలను పట్టించుకోకుండానే ఏపీ సర్కారు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకుంది. దీంతో కినుక వహించిన గవర్నర్.. తాను చేసిన సూచనలను బిల్లులో ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదనే విషయమై ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసారు. బిల్లును వెనకి తిప్పి పంపకుండానే గవర్నర్ ఆ అంశంపై సీఎం కు లేఖ రాయడంతో దీనిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం రైవెన్యూ శాఖను ఆదేశించిన్నట్లు తెలిసింది. దీంతో గవర్నర్ వ్యవహార శైలిపై తెలుగుదేశం వర్గాలు గుర్రుమంటున్నాయి.