రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని ఓ నానుడి.. దాన్ని అక్షరాలా నిజం చేస్తుంటారు కొందరు నాయకులు.. అప్పటివరకూ ఆప్తమిత్రులుగా ఉన్న వాళ్లే పార్టీ మారిన తర్వాత విమర్శల రాళ్లేస్తుంటారు. అప్పటివరకూ కనిపెట్టుకుని ఉన్న గుట్టులన్నీ గట్టు దాటి అవతలి పక్షానికి చేరుకున్నాక ఒక్కొక్కటిగా బయటపెడుతుంటారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అయినా.. ఇప్పుడు జగన్ కు అనుభవంలోకి వస్తున్నాయి.
నిన్న మొన్నటివరకూ వైసీపీలో కీలకనేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ మంత్రి పదవి ఆశ చూపగానే పసుపు జెండా చేతబట్టుకున్నారు. జగన్ సొంత జిల్లాలోనే ఇప్పుడు మంత్రిగా అధికార ధర్పం చూపిస్తున్నారు. జగన్ పై ఎలాంటి విమర్శలు గుప్పించాలన్నా ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం.. గతంలో వైసీపీలో పని చేసిన వారినే ఎంచుకుంటోంది. వారితో విమర్సలు చేయిస్తే కొంతవరకూ జనంపై ప్రభావం ఉంటుందన్నది వారి అంచనా.
తాజాగా.. మంత్రి ఆదినారాయణ రెడ్డి మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఓ సమస్య ఉందన్న సంగతి బయటపెడుతున్నారు. జగన్కు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనపడుతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి వెటకారం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నా.. ఆయనకు మాత్రం కనిపించడంలేదని సెటైర్లు పేలుస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, పులివెందులలో రాజమహల్ లాంటి భవనాలు ఉన్నా తనకు ఏమీ లేవని చెప్పడం జగన్ అవివేకానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
జగన్ సొంత జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆయనకు చెక్ పెట్టాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలోకి తీసుకుపోతామని ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఉక్కు పరిశ్రమ కడప జిల్లాలో ఏర్పాటు కానుందని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని కూడా మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు.