రాయలసీమ.. ఆంధ్రప్రదేశ్ లోనే వెనుకబడిన ప్రాంతమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది. తాగు, సాగు నీటి సౌకర్యాలు లేక.. మొదటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటి రాయలసీమకు ఇటీవల ఐటీ కళ వస్తోంది. విజయవాడ, విశాఖ తర్వాత రాయలసీమలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రయత్నాల ఫలితంగా చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. తాజాగా తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమ జోహో కార్పొరేషన్, తిరుపతి నగరంలో డిసిగ్నేటెడ్ టెక్నికల్ పార్క్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్లో ఉన్న ఐటీ కంపెనీలు ఏజీఎస్ హెల్త్, ఎక్సాఫ్లూయెన్స్, ట్రిప్నేత్రా, ఏఎన్ఎస్, ఇన్జీనియస్, వైఐఐటీ, పరిక్కార్ పరిశ్రమలను కూడా సీఎం ప్రారంభించారు.
ఐఐటీ, ఐసర్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఉండటంతో తిరుపతిలో ఐటీ నిపుణులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నారని సీఎం తెలిపారు. బెంగళూరు నగరంలో మౌలికవసతుల కొరత, చెన్నైలో ఇతర సమస్యలతో ఐటీ పరిశ్రమలకు తిరుపతి ప్రత్యామ్నాయంగా నగరం నిలుస్తోందన్నారు. ఐటీ కంపెనీలతో పోటీ పడుతూ రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో ఐటీ విధానాలను తీసుకువచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2024 నాటికి సైబరాబాద్, గచ్చిబౌలి లాంటి ఐటీ కేంద్రాలను రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. 26 సంవత్సరాల్లో హైదరాబాద్లో జరిగిన ఐటీ అభివృద్ధిని కొత్త రాష్ట్రంలో ఐదేళ్లలో చేస్తామని తెలిపారు. ఏదేమైనా చిత్తూరు వంటి మారుమూల జిల్లల్లోనూ ఐటీ వెలుగులు విరజిమ్మడం నిరుద్యోగ యువతకు సంతోషాన్నిస్తోంది.