2019 సాధారణ ఎన్నికలు తెలంగాణలో చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. సీఎం కేసీఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణకు వరుసగా రెండోసారి కూడా తానే సీఎం కావాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకుంటున్నారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ కూడా కేసీఆర్ను ఢీ కొట్టి అధికారంలోకి ఎలా రావాలా ? అని కిందా మీదా పడుతోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్కు కంచుకోట అయిన పాత వరంగల్ జిల్లాలో ఈ సారి ఆ పార్టీకి గెలుపు అంత సులువుగా కనపడడం లేదు.
ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్లులో ఆరుస్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ పరిస్థితులను అనుకూలంగా మలచుకుని, పార్టీని విజయతీరాలకు చేర్చే నాయకుడి కొరత ఏర్పడింది. పార్టీ క్యాడర్లో నూతనొత్తేజం నింపి, విశ్వసనీయతను పెంచే లీడర్ కావాలి. సాధారణ ఎన్నికలు సమీస్తున్న వేళ జిల్లాలో నాయకత్వం కొరత పార్టీని వెంటాడుతుండడం కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఉమ్మడి వరంగల్ లో మానుకోట, భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, జనగామ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఈ సారి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే... ఈ అవకాశాలు కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి వల్లే ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అటు టీఆర్ఎస్ క్యాడర్లో, ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కరువయ్యాడు.
భూపాలపల్లి ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, ములుగు ఎమ్మెల్యే, మంత్రి చందూలాల్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వరని స్వయంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో సరైన లీడర్లను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపితే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో ? చూడాలి.