బీసీలు లేకపోతే.. టీడీపీ పార్టీనే లేదని పదే పదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు.. వారికి అనుకూలంగా ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కాపులకు రిజర్వేషన్ కల్పించిన సమయంలోనూ బీసీలకు ఇబ్బంది లేకుండా 50% రిజర్వేషన్కు పైనే 5% కల్పించి బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీసీల్లోని వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అని ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. మరి పార్టీ అధినేత చంద్రబాబు ఇలా బీసీలను వెనుకేసుకు వస్తుంటే.. పార్టీలోని సీనియర్ నేత, గుంటూరు కు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదే బీసీలకు వ్యతిరేకంగా తీర్మానాలు, నిర్ణయాలు చేస్తున్నారని స్థానిక నేతలు భారీ ఎత్తున మండిపడుతున్నారు.
గుంటూరులో గత నెల రోజులుగా ఈ విషయం ప్రధానంగా చర్చకు వస్తోంది. అంతేకాదు, మంత్రిగారి నిర్వాకంపై సీఎం చంద్రబాబుకు బీసీల నేతలు ఫిర్యాదులు చేసే వరకు కూడా విషయం వెళ్లిందంటే గుంటూరు జిల్లాలోని బీసీ నేతలకు మంత్రి ఏ రేంజ్లో పొగబెడుతున్నారో అర్ధం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ అంశం గత కొన్నాళ్ల క్రితం తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
ఒప్పందం ప్రకారం రాజీనామా చైర్పర్సన్ జానీమూన్ రాజీనామా చేసి.. బీసీ అభ్యర్థికి సీటును ఇవ్వాల్సి ఉంది. అయితే, సదరు జానీమూన్ రాజీనామా చేయకుండా పదవిని అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మంత్రి పుల్లారావు ఆమెకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారని స్థానికి బీసీ నేతలు చెబుతున్నారు. బీసీ వర్గాలకు కేటాయించిన జడ్పీ ఛైర్మన్ పదవి అప్పట్లో ముస్లిం వర్గానికి చెందిన జానీమూన్కు రెండున్నరేళ్లు.. బీసీ వర్గానికి చెందిన వారికి రెండున్నరేళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు మంత్రి హోదాలో అప్పట్లో రావెల కిశోర్ బాబు ప్రయత్నించారు. అయితే, ఇది వివాదం కావడంతో ఆయన పదవినే కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి జిల్లాలో ముస్లిం ఓటర్ల కన్నా.. బీసీ సామాజికవర్గ ఓట్లు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు అధినేత కూడా బీసీలను దేవుళ్లంటూ ప్రకటిస్తున్నారు. కానీ, మంత్రి పుల్లారావు మాత్రం బీసీలకు దక్కాల్సిన చైర్మన్ పోస్టును దక్కనీయకుండా ముస్లిం వర్గానికి కొమ్ముకాస్తున్నారని అంటున్నారు స్థానిక నేతలు.
అంతేకాదు, ఇదే విధంగా కొనసాగితే...రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బీసీ వర్గానికి చెందిన నేతలు హెచ్చరిస్తుండడం గమనార్హం. ఇక, ఈ విషయం తాజాగా సీఎం చంద్రబాబు చెంతకు చేరిందని తెలిసింది. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి సొంత జిల్లాలో తనకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టిన పుల్లారావుకు షాక్ తప్పదని అంటున్నారు.