``నాకు అధికారం అక్కర్లేదు. నేను ప్రజాసేవకుడిగానే ఉంటా. సీఎం సీటు అసలే అక్కరలేదు. దీనికి బోలెడంత అనుభవం కావాలి`` ఏపీలో మూడు రోజలు పర్యటన నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించిన అభిప్రాయం ఇది. అయితే, మరి ఆయన ఎవరి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు? ప్రజా సేవ చేయాలని అనుకుంటే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటిమాదిరిగానే జనసేనను స్వచ్ఛంద సంస్థల జాబితాలో చేర్చితే సరిపోతుంది. మరి అలా కాకుండా.. జనసేనను పార్టీగా మలిచి.. ప్రజల్లోకి వచ్చి అధికారం అక్కర లేదని చేస్తున్న ప్రచారం వెనుక ఏముంది? పవన్ వ్యూహం ఏంటి? ఆయనను ఎవరైనా నడిపిస్తున్నారా? వంటి అనేక సందేహాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలను పట్టిపీడిస్తున్నాయి.
ఏపీలో 2014లో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించాడు పవన్. అప్పట్లోనే పార్టీ పెట్టినా పొటీకి దూరంగా ఉండిపోవడమే కాకుండా బీజేపీ-టీడీపీ మిత్రపక్షానికి మద్దతిచ్చి.. ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చేలా చేశాడు. పోనీ.. ఆ తర్వాతైనా.. పార్టీని డెవలప్ చేశాడా? అంటూ అది కూడాలేదు. ఇప్పటికి నాలుగేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాది లేదా ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. పోనీ ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే వ్యూహం కనిపిస్తోందా? అంటే అదీ లేదు.
ఇదిలావుంటే, ఇటు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబుపై పలు జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. బాబు చెబుతున్న దానికీ చేస్తున్న దానికీ సంబంధం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాబును ప్రశ్నించాల్సిన పవన్ ఈ విషయంలో మౌనం వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పవన్.. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. ఆ తర్వాతైనా హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారా? అంటే అది కూడాలేదు.
తెలంగాణ విషయానికి వస్తే.. అక్కడ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన 24 గంటల ఉచిత విద్యత్ను దేశంలోనే గొప్పదిగా అభివర్ణించాడు పవన్. అయితే, అదేసమయంలో నేరెళ్ల రైతుల ఘనను, ఉస్మానియాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని కేసీఆర్ అడ్డుకున్న విషయాన్ని కూడా పవన్ మరిచిపోయాడు. ఇక, ఇప్పుడు తెలంగాణలో యాత్ర ప్రారంభిస్తున్నాడు.
అధికారం అవసరం లేనప్పుడు యాత్రలతో పనేంటో పవనే చెప్పాలి. కానీ, విశ్లేషకుల అంచనా ప్రకారం.. అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోనూ అధికార పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే పవన్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలోను, తెలంగాణలోనూ విపక్ష పార్టీల ఓట్లను చీల్చడం ఒక్క పవన్కే సాధ్యం. పవన్ అభిమానులు, విద్యార్థులు జనసేనకు ఓట్లు వేస్తారనడంలో సందేహంలేదు. దీనికితోడు తటస్థులను కూడా తన పార్టీవైపు మొగ్గేలా చేసుకుని విపక్షాలను దెబ్బతీయాలనే చంద్రబాబు, కేసీఆర్ ల వ్యూహాలకు అనుగుణంగా పవన్ పావులు కదుపుతున్నారని, ఇది కేవలం పొలిటికల్ గేమేనని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.