ఏంటి? అతిశయోక్తి అనుకుంటున్నారా? వ్యంగ్యం అని నవ్వుకుంటున్నారా? విమర్శ అని మూతి ముడుచుకున్నారా? ఇలాంటివేవీ కావు. ఇది నెటిజన్ల అభిప్రాయం!! ఏపీలో బీజేపీకి సీఎం చంద్రబాబే అధ్యక్షుడు అయ్యాడనే కామెంట్లు ఒక్క నెటిజన్ల నుంచే కాదు టీడీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి! ఏపీలో బీజేపీపై ఈగ వాలితే ఆయన అస్సలు సహించలేకపోతున్నారు. బీజేపీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. బీజేపీ నేతలు టీడీపీ నేతలను అమ్మ నాబూతులు తిట్టినా.. వారికి అక్కున చేర్చుకుంటున్నారంటే బాబు మరి బీజేపీని కంటికి రెప్పలా చూసుకుంటున్నారా? లేదా? ఇప్పుడు ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
విభజన తర్వాత తీవ్ర కష్టనష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవడంలో కేంద్రంలోని బీజేపీ తీవ్ర నిర్లక్ష్యం చూపింది. నిధులు ఇవ్వడంలో మొండి చేయి చూపించింది.
ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లంటూ రాజ్యసభలో దీర్ఘాలు తీసిన బీజేపీ నేతలే తర్వాత కాలంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే ఎక్కువన్నారు. ఇక, రాజధాని నిర్మాణంపై ఇప్పటి వరకు ఉలుకు, పలుకు కూడా జాన్తానై! పోలవరం కేంద్ర ప్రాజెక్టు.. మీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నిస్తూనే.. దీనిపై కనీసం శీత కన్ను కూడా సారించడం లేదు. అయినా కూడా ఏపీ ప్రభుత్వం బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగించాలి.
కేంద్రం కర్ర కాల్చి వాత పెడుతున్నా.. బీజేపీ నేతల నోటికి వెన్నముద్దలు అందించాలి. ఇదీ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహార శైలి. ఇది ఇప్పుడు మరింత ముదిరింది. రెండు రోజుల కిందట చంద్రబాబు.. కేంద్రం నుంచి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కాకపోతే.. కోర్టుకైనా వెళ్లి తేల్చుకుంటామని ప్రకటించారు. ఈ కామెంట్లు పెద్ద ఎత్తున కలకలం సృష్టించాయి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న పార్టీ.. టీడీపీ అధినేత ఇలా వ్యాఖ్యానించడం ఏంటి? ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు.
అంతెందుకు.. సొంత పార్టీలోనే నేతలు ``ఇది సాధ్యమా? బాబు భ్రమ పడుతున్నారా?`` అని చర్చించుకున్నారు. అంతేకాదు, ఓ వర్గం ఏకంగా బీజేపీపై చంద్రబాబు కోర్టుకు వెళ్తున్నారంటూ ప్రచారం చేసింది. దీనిలో తప్పేమీ లేదు. నిజానికి కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షమే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ లీడర్. సో.. బీజేపీపై కోర్టుకు వెళ్తున్నారని అనుకోవడం సందేహం లేదు. అయితే, ఈ వ్యాఖ్యలు తన చెవిన పడగానే యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు మీడియా మీటింగ్ పెట్టారు. బీజేపీపై ఈగ వాలితే సహించేది లేదన్నట్టుగా మాట్లాడారు.
కోర్టుకు వెళతామంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని చెప్పారు. తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు. బీజేపీకి తాను ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. సో.. మరి ఈ వైఖరిని బట్టి.. ఏపీ బీజేపీకి చంద్రబాబు అధ్యక్షుడని అంటున్న నెటిజన్ల కామెంట్లలో తప్పు ఉందంటారా?!