జగన్ స్నేహితుడికి డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే కేంద్ర సంస్థ భారీ షాక్ ఇచ్చింది. ఇంతకీ సదరు స్నేహితుడు ఎవరా అని అనుకుంటున్నారా..ఇప్పుడు అంత సీన్ లేదు కానీ.. గతంలో వీరి మధ్య స్నేహం ఓ రేంజ్ లో ఉండేది. వైఎస్ బతికున్న కాలంలో ఓ వెలుగు వెలిగిన ఓబుళాపురం గనుల ఘనాపాఠి గాలి జనార్ధన్ రెడ్డి గుర్తున్నాడుగా.. అవును ఆయనకే ఇప్పుడు డీఆర్ఐ షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుక్కుపోయిన ఆయనకు ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది.
కడప జిల్లాలో బ్రహ్మణి ఇండస్ట్రీస్ కోసం యంత్రాల కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. కస్టమ్స్ సుంకం తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోయేటప్పటికి చేసేదిలేక 189 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను జప్తు చేసేసింది.ఇంతకీ ఈ కేసు వివరాలేమిటో ఓ సారి చూద్దాం.. కడప జిల్లా జమ్మలమడుగులో గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణీ ఇండస్ట్రీస్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారు.
ఓబుళాపురం మైనింగ్ నుంచి వెలికి తీసిన ఇనుప ఖనిజంతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. బ్రహ్మణి పరిశ్రమ కోసం యంత్రాలను విదేశాల నుంచి చెన్నై ఓడరేపు ద్వారా దిగుమతి చేసుకున్నారు. విదేశీ వ్యాపార విధానంలో భాగంగా ఎగుమతుల ప్రోత్సాహక మూల పరికరాల పథకం.. ఈపీసీజీ కింద గాలి జనార్థన్రెడ్డి కస్టమ్స్ సుంకం మినహాయింపు పొందారు.
ఐతే.. ఇక్కడో మెలిక ఉంది. నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకున్న యంత్రాలను ఆరు నెలల్లో అమర్చాలి. మినహాయింపు పొందిన సుంకానికి ఎనిమిదింతల విలువైన ఉక్కును ఎగుమతి చేయాలి. కానీ.. ఆ తర్వాత కాలంలో వచ్చిన సంక్షోభాల కారణంగా అసలు బ్రహ్మణి స్టీల్ ప్రారంభమే కాలేదు. సో.. ఎగుమతుల ఊసే లేదు. అందుకే మినహాయింపు సొమ్ము కట్టాలంటూ డీఆర్ఐ ఒత్తిడి చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో జమ్మలమడుగులో ఉన్న 189 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను జప్తు చేసింది. అదన్నమాట సంగతి.