తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారా? కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు కేసీఆర్ను ఇరికించాలని చూస్తోందో? ఆ సమయం కాస్తా.. ఆ పార్టీకి చిక్కిందా? ఢిల్లీలో కేజ్రీ వాల్ ప్రభుత్వానికి పట్టిన గతే కేసీఆర్కు కూడా పడుతుందా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ నేతలు ఔనని సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శి హోదాలో కొనసాగి లాభదాయ పదవి నిర్వహించారనే అభియోగంపై వీరి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. అయితే, ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలోనూ జరిగిందని ఇక్కడి విపక్షం వెల్లడించింది.
2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రివర్గ సంఖ్యకు పరిమితి ఉండడంతో పలువురికి పార్లమెంటరీకార్యదర్శి పోస్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్యేను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్బాబుకు పార్లమెంటు కార్యదర్శి పదవులు దక్కాయి.
రాజ్యాంగ విరుద్ధంగా ఈ పదవువులను ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. పదవులు రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దు చేసింది. దీంతో కథ అక్కడితో ముగిసిందని అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనుకుని ఉంటారు. కానీ, ఇప్పుడు ఆప్ ప్రభుత్వానికి ఎదురైన అనుభవం, జరిగిన ఘోరాన్ని స్టడీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్.. ఇదే అదనుగా కేసీఆర్ను తీవ్రస్థాయిలో ఇరుకున పెట్టేందుకు రెడీ అయింది. పాత కేసును తొవ్వి తీసి.. ఈసీ గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో గతంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ పరిణామం తెలంగాణ అదికార పార్టీ నేతల్లో ఒణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకున్నారనే అపవాదు భరిస్తుండగా.. తాజాగా పార్టమెంటు కార్యదర్శుల పోస్టుల ఉచ్చు బిగిస్తే.. కేసీఆర్కు ఇబ్బందేనని అంటున్నారు విశ్లేషకులు మరి ఏం జరుగుతుందో చూడాలి.