అసలే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది తెలంగాణ తెలుగుదేశం పరిస్థితి. పార్టీ నుంచి ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూస్తే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి రోజు రోజుకు ఎంత వీక్గా తయారైందో చెప్పక్కర్లేదు. 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న పొజిషన్ నుంచి టీడీపీ ప్రస్తుతం కేవలం సింగిల్ ఎమ్మెల్యే రేంజ్కు పడిపోయింది. అందరూ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో కారెక్కేశారు.
ఈ మూడున్నరేళ్లలో ఎర్రెబెల్లి దయాకర్రావు, రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి కీలక నేతలు బాబుకు బై చెప్పి టీఆర్ ఎస్లో చేరిపోయారు. ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి లాంటి వాళ్లు పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అయితే ఏకంగా టీటీడీపీని టీఆర్ఎస్లో కలిపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిని బట్టి పార్టీలో ఉండేందుకు సీనియర్లు కూడా ఇష్టపడడం లేదని క్లీయర్గా తేలిపోయింది. ఇక ఇప్పుడు మరో సీనియర్ నేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా ఉన్న నామా నాగేశ్వరరావు కూడా జంపింగ్ జాబితాలో చేరిపోయాడని వార్తలు వస్తున్నాయి. బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నామా టీడీపీని వదిలేసి హస్తం గూటికి చేరిపోతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. గతంలో టీడీపీ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన నామా గత ఎన్నికల్లో వైసీపీ క్యాండెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలకు తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం చూపే పరిస్థితులు లేకపోవడంతో నామా పార్టీ మారేందుకు చంద్రబాబు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ మారే విషయాన్ని నామా చంద్రబాబు వద్ద ప్రస్తావించగా ఆయన కూడా ఓకే చెప్పేశారని టాక్. నామా కూడా పార్టీ మారిపోతే ఖమ్మం జిల్లాలో కాస్తో కూస్తో పట్టున్న టీడీపీ మరింత దిగజారడం...ఇక అసలు ఉనికిలోనే లేకుండా పోతుంది అనడంలో డౌటే లేదు.