2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీ గద్దె ఎక్కిన మోడీ ఆతర్వాత వరుస విజయాలతో తనకు ఎదురే లేదని నిరూపించుకున్నారు. అయితే ఈ స్పీడుకు రాజస్థాన్ లో బ్రేకులు పడ్డాయి.సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అజ్మీర్, అల్వార్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మండల్గర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో మూడు సీట్లను కైవలం చేసుకుంది.
తాజా ఎన్నికల ఫలితాలతో పార్టీలోని అసంతృప్తులకు అవకాశం చిక్కినట్లు అయింది. బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీపై నిప్పులు చెరిగే ఈ షాట్గన్.. తాజాగా రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించారు. దేశంలో బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన తొలి రాష్ట్రం రాజస్థానేనని ఆయన పేర్కొన్నారు. 'బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీకి విపత్కర ఫలితాలు వచ్చాయి.
బీజేపీకి ట్రిపుల్ తలాక్ చెప్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, అల్వార్: తలాక్, మండల్ గఢ్: తలాక్. మన ప్రత్యర్థులు రికార్డు మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తూ.. మనకు ఝలక్ ఇస్తున్నారు' అని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ మేలుకొని నష్ట నివారణ చర్యలు చేపడితే సరి లేదా త్వరలోనే బీజేపీకి టాటా-బైబై చెప్పే ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.