రాజకీయాల్లో ఎంత సీనియారిటీ ఉన్నా నిత్యం ప్రజల్లో లేకపోతే వాళ్ల పని అంతే. ఐదారు సార్లు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్లు సైతం ప్రజాగ్రహంలో కొట్టుకుపోయిన సందర్భాలు అనేక మంది రాజకీయ నాయకుల చరిత్రల్లో మనం చూశాం. తాజాగా ఇప్పుడు ఏపీలోని సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకురాలి చరిత్ర కూడా చరిత్ర పుటల్లో కలిసిపోయేందుకు రంగం సిద్ధమైందా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే చెపుతున్నాయి.
గుంటూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీ పేరు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్లో ఉన్న గల్లా అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలోకి జంప్ చేసిన అరుణ చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా, ఆమె తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. జయదేవ్ ఎంపీగా గెలిస్తే, అరుణ మాత్రం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేతిలో ఓడిపోయారు.
సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చంద్రగిరిని 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా ఏలేసిన అరుణ ఇప్పుడు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆమెపై ఇప్పుడు నియోజకవర్గ టీడీపీలో తీవ్రమైన రేంజ్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకోపోవడం ఓ మైనస్ అయితే, ఆమెతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రయారిటీ ఇస్తుండడం, బలమైన టీడీపీ లీడర్లను పక్కన పెట్టేయడం, పీఏ చెప్పినట్టు చేస్తోందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
ఇక చంద్రబాబు ఆ నియోజకవర్గానికి వెళ్లినా నారావారిపల్లెలో ఉన్నా కూడా ఆమె చంద్రబాబును కలవడం లేదు. ఇవన్నీ చంద్రబాబుకు ఆమెపై కోపం నషాళానికి అంటడానికి రీజన్గా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి జయదేవ్ను కంటిన్యూ చేసి చంద్రగిరిలో మాత్రం అరుణను పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారట. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఇందు శేఖర్తో పాటు పేరం హరిబాబు టిక్కెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరికి ఇంకా చెప్పాలంటే శేఖర్పైనే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఫైనల్గా గల్లా అరుణ పొలిటికల్ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయినట్టే..!