తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ వెనక కాంగ్రెస్ నేతలు ఉన్నారా...? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జేఏసీ నేతలకు కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఇప్పించింది కోదండరామేనా..? అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తున్నారా? పలికేది కోదండరాం... పలికించేది కాంగ్రెస్ పార్టీయేనా..? తెలంగాణలో ఇప్పుడీ ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, గజ్జల కాంతం, కత్తి వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు ఇప్పించింది కోదండరామేననే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.
తెలంగాణ ఏర్పాటు వరకు కలిసే ఉన్న కోదండరాం, కేసీఆర్కు ఆ తర్వాత తీవ్రస్థాయిలో విబేధాలు ఏర్పడ్డాయి. ఎన్నికల తర్వాత గ్యాప్ రావడంతో అప్పట్లోనే టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అలాగే మొదటి నుంచి కోదండరాం తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా కోదండరాం కు కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం అండగా ఉందని, ఆ వర్గం ప్రోద్బలంతో నే ఆయన పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు జేఏసీ నాయకులు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు. కోదండరాం ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని లోలోపల మదనపడుతున్నట్లు సమాచారం.
మిలియన్ మార్చ్ నిర్వహించిన మార్చి 10న వరంగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ పేరును ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే అవకాశం ఉందని పలువురు జేఏసీ నేతలు అంటున్నారు. ఇదిలావుండగా కోదండరాం పార్టీకి డబ్బంతా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం సమకూర్చుతోందనే ఆరోపణలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు, విమర్శలను పట్టించుకోకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా కోదండరాం ముందుకెళ్తున్నారు.
తటస్థ జనాలు మాత్రం కోదండరాం నిజాయితీని శకించాల్సిన అవసరం లేదని ఆయనకు అండగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చే వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల పెట్టుబడిని ఉచితంగా అందజేయనున్నారు. తాను కూడా రైతుల కోసమే వస్తున్నానని చెబుతున్న కోదండరాం కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తామనే సంకేతాన్ని పరోక్షంగా తన అనుచరులకు ఇవ్వడం గమనార్హం.