పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి పాలిటిక్స్ లోకి వస్తానని చెబుతున్నా.. గత ఐదేళ్లుగా ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే ఉన్నారు. అంతే కాదు ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుదారుగా మారి.. చివరకు ఆయన తొత్తుగా ముద్ర వేసుకున్నారు. ఓటు కు నోటు వంటి సీరియస్ ఇష్యూను కూడా పవన్ లైట్ గా తీసుకోవడంతో ఈ చంద్రబాబు తొత్తు అన్న ముద్ర బలంగా పడిపోయింది.
కానీ ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటకు వచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన.. ఏపిలో విభజన సమస్యలను, ప్రత్యేక హోదా గురించి చర్చించి, వాటిని సాదించడానికి జేఏసీ ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ జేఏసీలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఉండటం విశేషం. ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ ఉండవల్లితో సమావేశం అవుతున్నారు. జయప్రకాశ్ నారాయణ మేథావిగా గుర్తింపు తెచ్చుకున్నా.. చంద్రబాబుపై అంత వ్యతిరేకత కనిపించదు. కానీ ఉండవల్లి కరుడు గట్టి చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. మంచి లాజిక్కులు లాగి నిలదీయగలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఇప్పుడు పవన్ కల్యాణ్ కలుస్తున్నారంటే ఏదో పెద్ద వ్యూహమే ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడేందుకు రెడీ అవుతున్నారని చెప్పేందుకు ఈ కలయిక ఓ నిదర్శనం కావచ్చేమో. అదే జరిగితే చంద్రబాబు జాగ్రత్తపడక తప్పదు. ఇన్నాళ్లూ లాజిక్ ఉండి వాయిస్ అంతగా లేని ఉండవల్లికి ఇప్పుడు ఇమేజ్, ప్రజాకర్షణ ఉన్న పవన్ కల్యాణ్ తోడైతే.. చంద్రబాబుకు గట్టిగానే చెక్ చెప్పే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.