మేధావిగా, విద్యావేత్తగా, ప్రొఫెసర్గా, ఉద్యమ నాయకుడిగా బహుముఖ గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కోదండ రాం.. తన పంథా మార్చుకున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, దీని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆది నుంచి ఆయన విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గత కొన్నాళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంపై నేరుగా మాటల యుద్ధాన్ని సాగిస్తున్నారు. ప్రతి విషయంలోనూ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రాణ ప్రదంగా, తనను తిరిగి సీఎంను చేస్తాయని భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి రైతుల వరకు, విద్యార్థుల నుంచి ఉపాధి వరకు కూడా ఏ విషయాన్ని వదిలి పెట్టకుండా కోదండ రాం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వంపై పోరాటం చేసే ఏ పార్టీకైనా ఆయన తన మద్దతు ఇస్తున్నారు.
ఎంత దూరం అయినా వెళ్లి ఆయా పోరాటాల్లో పాల్గొని తన వాణిని వినిపిస్తున్నారు. కేసీఆర్ సహా కేటీఆర్లే లక్ష్యంగా రాజకీయ విమర్శలను చాలా జాగ్రత్తగా ఆలోచించే విధంగా కూడా కోదండ రాం మాట్లాడుతున్నారు. మొదట్లో కేసీఆర్.. కోదండ రాంను లైట్గా తీసుకున్నా.. అయితే, రానురాను.. కోదండ రాం తన విమర్శల వాడిని, వేడిని కూడా భారీ ఎత్తున పెంచేశారు. అమీతుమీకి కూడా సిద్ధమన్నారు. అవసరమైతే.. తాను జైలుకు సైతం వెళ్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీలు అన్నీ కలిసి వచ్చి కేసీఆర్ను దింపితే.. తాను సంతోషిస్తానని కూడా ప్రకటించారు. బంగారు తెలంగాణ.. ఈ కుటుంబ రాజకీయం వల్ల రాదని, ఫామ్ హౌస్ ప్రభుత్వాన్ని దింపాలని ఆయన పదే పదే ఇటీవల కాలంలో పిలుపు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా పార్టీ పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. పార్టీ పేరును తెలంగాణ జన సమితిగా ప్రకటించారు.
మొదట్లో కేసీఆర్ ఈ పార్టీ కూడా ఓ పార్టీయేనా? సర్పంచ్గా కూడా గెలవలేని నేతలా పార్టీలు పెట్టేది అంటూ ఎద్దే వా చేశారు. నిజానికి అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ, నెల రోజుల కిందట కొలువుల కొట్లాట పేరుతో కోదండ రాం నిర్వహించిన సభ చూసి.. వీరందరికీ మతి పోయింది. ఎన్ని నిర్బంధాలు విధించినా .. యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున కోదండరాంకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీ పెట్టేందుకు సిద్ధమైన కోదండ రాంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. అదేసమయంలో కోదండ రాం ఎంచుకున్న విజన్పైనా కేసీఆర్ ఇబ్బందిగానే ఫీలవుతున్నట్టు టీఆర్ ఎస్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు.. కేసీఆర్ ఏం చేసినా.. ఎన్నికల సమయం సమీపించే సరికి రైతుల పక్షపాతిగా మారిపోయారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ప్రాజెక్టులు కట్టిస్తున్నారు.
కాళేశ్వరాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించారు. రైతులకు అనుకూలమైన అన్ని విషయాలను 24 గంటల్లోనూ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కోదండ రాం కూడా ఇదే విషయాలను ఎంచుకున్నారు. తాను పార్టీ పెడితే.. రైతుల పక్షానే పోరాటం అంటూ చూచాయగా ప్రకటించారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టుల్లోని అవినీతి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు ఇలాంటి అంశాలపైనే కోదండ రాం కూడా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. దీంతో మొత్తంగా కోదండ రాం వ్యూహం సక్సెస్ అయితే.. తమ పరిస్థితి ఏంటని కేసీఆర్ టీం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే ఈ విజన్ జనాల్లోకి వెళ్తే.. కేసీఆర్కు దిమ్మతిరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.