జనసేనాని పవన్ కళ్యాణ్ తన వ్యూహం మార్చుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నికలు ఓట్లు.. అంటూ హంగామా సృష్టించి యాత్రలు చేసిన ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఏపీ విభజన హామీల అమలు కోసం ఉద్యమించాల్సిన తరుణంలో ఆయన జేఏసీ అంటూ కొత్త పంథా ఎంచుకున్నాడు. అంతేకాదు, నిజనిర్ధారణ కమిటీ అంటూ కొత్త పల్లవి ప్రవచించాడు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితి ఈ రెండూ కూడా వేస్టనేది కొందరి మాట. సరే.. ఈ మాటను పక్కన పెడితే.. జేఏసీ పేరుతో పవన్ ఎవరితో పొత్తుకు సిద్ధమయ్యారు? తన బ్యాచ్లోకి ఎవరిని ఆహ్వానించారు? అనేది కీలక అంశంగా మారింది. అంతేకాదే, పవన్ చెబుతున్నట్టు జేఏసీ సాధించేది ఏమైనా ఉంటుందా? అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అదేసమయంలో పవన్ కలిసిన వారికి అంత ప్రజాదరణ లేదు. వారు ప్రజల్లో నేరుగా ప్రసంగించిన భారీ అనుభవమూ లేదు. దీంతో అలాంటి వారి వల్ల పవన్ ఆశిస్తున్న ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే అదీ చెప్పడం కష్టమే. పవన్ జేఏసీ స్థాపన పేరుతో లోక్సత్తా వ్యవస్థాపకుడు మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణను కలిశారు. ఆయన ద్వారా జేఏసీని బలోపేతం చేయడంతోపాటు ఏపీకి జరిగిన అన్యాయాలపై పోరాటానికి కూడా సిద్ధమయ్యాడు. అయితే, ప్రజా పోరాటంలో జేపీ సత్తా ఎంత? ఏపాటిది? అని చూసుకుంటే.. మాత్రం ఇక్కడ కూడా ప్రశ్నలే మిగులుతాయి. ఆయన మేధావే. అందులో అనుమానం లేదు. కానీ, ప్రజాపరంగా చూసుకున్నప్పుడు వాదించి నెగ్గే లక్షణం.. బలమైన గళం వినిపించడం వంటి విషయాల్లో ఆయన విఫలమైన నాయకుడుగానే మిగిలిపోయారు.
లోక్సత్తాను పొలిటికల్ పార్టీగా మార్చినా.. ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ల లేకపోయారు. గెలిపించుకోలేకనూ పోయారు. దీంతో ఆయనతో చెలిమి వల్ల పవన్కు ఒరిగేది ఏమీలేదు. ఇక, ఇదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా పవన్ కలిశారు. ఆయనను కూడా కూడగట్టుకుని ఏపీ విభజన హక్కులసాధనకై పోరాడతానని చెప్పాడు. అయితే, ఉండవల్లి మాత్రం ఏమన్నా ప్రజల్లో భయంకరమైన పాపులారిటీని సొంతం చేసుకున్న నాయకుడా? అని యోచిస్తే.. అది కూడా ప్రశ్నగానే మిగులుతుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా ఉండడంతో ఆయన చలవతో ఎంపీ అయిన ఆ తర్వాత రాజకీయంగా వెనకడుగు వేశారు.
పోనీ.. ఇప్పుడైనా.. ఉండవల్లి సొంతగా ఓ సభ పెట్టి ఓ వెయ్యి మంది మద్దతు దారులను కూడగట్టగలరా? అంటే అదీ లేదు. వీరిద్దరూ కూడా కేవలం మీడియా గొట్టాలకు మాత్రమే పరిమితమైన మేధావులు. ఇలాంటి వారిని పట్టుకుని విభజన హామీల సాధ్యం అంటూ పవన్ చేస్తున్న పరుగు ఎంత దూరం వెళ్తుంది? అంటే చెప్పడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరో పక్క, పవన్కు నమ్మకమైని మిత్రపక్షం టీడీపీ ఈ జేఏసీపై మండి పడుతోంది. మరి పవన్ తన దశ, దిశను మార్చుకుంటాడా? లేదా? అనేది చూడాలి.