ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ని ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ కు, అదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2009 ఎన్నికల్లో రమేశ్ రాథోడ్ టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖనాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో ఖనాపూర్ నుంచి గెలిచిన సుమన్ రాథోడ్ తర్వాత 2009లో భర్త రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా గెలిస్తే, ఆమె ఖనాపూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు.
2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి పోటీ చేసిన తండ్రి, కొడుకు రితీష్ రాథోడ్ ఇరువురు ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం టీడీపీకి రాజీనామా చేసి అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఇరువురు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో రమేశ్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా కుమారుడు రితీష్ రాథోడ్ ఖనాపూర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ఎవరివారుగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
రమేష్రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఎంపీగా ఉన్న నగేష్ బోథ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఆయన కుమారుడు రితీష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఖనాపూర్లో రేఖానాయక్కు ఎర్త్ పెట్టక తప్పని పరిస్థితి దీంతో ఇప్పుడు ఇక్కడ రేఖా నాయక్ను రమేష్ టార్గెట్ చేస్తున్నట్టే కనపడుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు, రమేశ్ రాథోడ్ కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది.
మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రేఖానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పార్టీలో గ్రూపు రాజకీయాలకు అజ్యం పోస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.