నిజమే! కష్టాల్లో ఉన్నప్పడే కదా మనకు ఎవరు ఉన్నారో? మన పక్షాన ఎవరు మాట్లాడుతున్నారో? మనకు మేమున్నామంటూ ఎవరు ముందుకు వస్తున్నారో? మనకు ఎవరెవరు జైకొడుతున్నారో? తెలిసేది. సరిగ్గా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైం ది. ముప్పేట దాడిలో ఆయన చిత్రవధ అనుభవిస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనూ 27 ఏళ్ల యువకుడిలా పనిచేస్తూ కూడా ఆయన మాటలు పడుతున్నారు. కుటుంబాన్ని వదులకుని, భార్యకు దూరమై, ముద్దుల మనవడికి కూడా దూరమై రాష్ట్రం కోసం కష్టిస్తున్నా.. ఆయన తీవ్ర చేదు అనుభవాలను చవిచూస్తున్నారు. మిత్ర పక్షం అని పేర్కొంటూనే బీజేపీ రాష్ట్ర నేతల నుంచి తీవ్ర అవమానాలు సైతం ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రధాన విపక్షం వైసీపీ నేతల నుంచి ఆ పార్టీ అధినేత జగన్ నుంచి సూటి పోటి మాటలకు, సవాళ్లకు లెక్కేలేకుండా పోయింది.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు బాబుపై నిప్పులు చెరుగుతున్నాయి. మరి ఇంత దుస్థితిలో బాబు ఇలా మాటలు పడుతుంటే.. ఆయనకు అండగా ఎవరూ లేరా? ఆయన పక్షాన నిలిచేందుకు ఎవరూ ముందుకు రారా? నాలుగేళ్ల పాలన తర్వాత కూడా ఆయన కలేజాను ఎవరూ గుర్తించలేదా? అంటే గత వారం కిందటి వరకు తెలుగు దేశం పార్టీ నుంచి నేతలు, మంత్రులు మాత్రమే మేమున్నామంటూ .. చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. బాబుపై ఈగవాలినా సహించేది లేదంటూ ఎదరు పోరుచేశారు. కానీ, గత పది రోజులుగా సీన్ రివర్స్ అయింది. బాబుపై జరుగుతున్న మాటల యుద్ధం వాడి, వేడి కూడా పెరిగింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నేతలు కూడా బాబును కాపాడలేని స్థితి వచ్చేసింది. ముప్పేట దాడి ముసురుకుంది. లెక్కలు చెప్పండి అంటూ బాబుకు మిత్రుడు, జనసేనాని కూడా గొంతు విప్పారు.
దీనికి ఉండవల్లి అరుణ్కుమార్, జేపీ వంటి వారూ తోడయ్యారు. ఇక, ఇదే సమయం అని బీజేపీ నేతలు సైతం రెచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ పోరు నుంచి చంద్రబాబుకు ఎవరు అండగా నిలవాలి? ఎవరు బాబును వెనకేసుకు రావాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలను టీడీపీ అధికారిక వెబ్సైట్ సంధించింది. మీలో ఉన్న నిజాయితీకి పరీక్ష అంటూ బాబుకు బాసటగా నిలిచేవారిని ఆహ్వానించింది. అంతే.. ఒక్క రోజులోనే బాబు వెనుక మేమున్నామంటూ.. ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్, మేధావులు, విదేశాల్లోని తెలుగువారు ఇలా కోటిన్నర మందికి పైగా తమ మద్దతును తెలుపుతూ.. టీడీపీ వెబ్సైట్కు వివిధ మాధ్యమాల్లో తమ మద్దతు తెలుపుతున్నారు. ``సీఎం సార్ గో ఎహెడ్`` అనే సంక్షిప్త సందేశాలను ముంచెత్తుతున్నారు. ``సీఎంసార్ యూఆర్ గ్రేట్. వుయ్ ఆర్ బిహైండ్ ఆఫ్యు. నెవర్ లాస్ ఏపీ బెనిఫిట్స్`` అని పిలుపునిస్తున్నారు.
ఇక, ఆఫ్ది రికార్డుగా కూడా గ్రామాలు, పల్లెలు , పట్టణాల్లోనూ ప్రజలు ముక్తకంఠంగా చంద్రబాబుకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు.. అందుకే కేంద్రంపై పోరుకు వెనుకాడేది లేదని ప్రకటనలు చేయడమే కాకుండా ఎంతకైనా సిద్ధమని చెబుతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు వెంట ఒక్క టీడీపీ నేతలు కాదు.. తెలుగు ప్రజలే నిలబడడం గ్రేట్! అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి విపక్షాలు ఇప్పటికైనా కలిసొచ్చి ఏపీ ప్రజల మాదిరిగా బాబుకు అండగా నిలిస్తే.. ఏపీ ప్రజల భవితవ్యంతో పాటు వారి భవితవ్యాన్నిసైతం బాగు చేసుకున్నవారు అవుతారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.